ఎమ్మెల్సీ: సోనియా వద్దకు క్యూ, కెవిపి ఇంటివద్ద కూడా
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఒక్కో స్థానానికీ ముగ్గురి పేర్లతో జాబితా ఇవ్వాల్సిందిగా అధిష్ఠానం కిరణ్, బొత్సలను ఆదేశించింది. శుక్రవారం సోనియా, ఆజాద్లతో భేటీ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ఆశావహులు సోనియాని ప్రసన్నం చేసుకునేందుకు రాజధానిలో మకాం వేశారు.
ఎమ్మెల్యే, నామినేటెడ్ కోటాల నుంచి 9 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశముంది. వీటికోసం దాదాపు ముప్పాతిక మందికి పైగా ఆశావహులు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద సోనియా కోసం బారులు తీరారు. వారిలో కొందరు సీనియర్ నేతలను సోనియా కలుసుకున్నారు. కానీ, ఇంకా పెద్దసంఖ్యలో నేతలు రావడంతో ఆశ్చర్యపోయి స్వయంగా బయటకు వచ్చి వారి నుంచి వినతిపత్రాలు అందుకుని పంపేశారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కంతేటి సత్యనారాయణ రాజు, కమలాకర్ రావు, పివి రాజేశ్వర రావు, పరిగి రామిరెడ్డి, కనుకుల జనార్దన్ రెడ్డి, మజ్జి శారద, కందుల దుర్గేశ్ తదితరులు సోనియాను కలుసుకున్నారు. మాజీ మంత్రులు గాదె వెంకట రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపి రాజయ్య కూడా సోనియాకు తమ లిస్టును అందించారు. సోనియా నివాసంతో పాటు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపిలు కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, వి హనుమంతరావు నివాసాల్లోనూ ఆశావహుల సందడి కనిపిస్తోంది.
ఢిల్లీకి చెందిన ప్రతి సీనియర్ నేత వద్దా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ ఆశావహులు కనిపించారు. రాహుల్ గాంధీ కనపడితే ఆయన వెంట పరుగులు తీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ అంశంపై బొత్స, కిరణ్లతో గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. ఒక్కో స్థానానికి ముగ్గురు ఆశావహుల పేర్ల జాబితాతో ఢిల్లీకి రావాల్సిందిగా ఆజాద్ వారిని కోరారు. శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియాతో ఆజాద్, కిరణ్, బొత్స సమావేశమై తుది జాబితాను ఖరారు చేసే అవకాశముంది.