జీవితా రాజశేఖర్: జగన్తో బెడిసికొట్టి చిరంజీవితో రాజీ
చిరంజీవి అంటేనే గతంలో ఒంటి కాలిపై లేచిన జీవిత రాజశేఖర్లు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల రాజశేఖర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. చిరంజీవి 150 సినిమాలో విలన్గా అవకాశం వస్తే సంతోషిస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ అవకాశం వస్తే నటిస్తానని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఆరేళ్లుగా నానుతున్న కేసు విషయంలోను జీవిత రాజశేఖర్లు వెనక్కి తగ్గారనే చెప్పవచ్చు.
గతంలో చిరంజీవిని ఉద్దేశించి రాజశేఖర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిని నిరసిస్తూ కొందరు చిరు అభిమానులు వారిపై దాడికి యత్నించారు. అయితే, ఈ కేసులో తాము నిందితులను గుర్తించలేమని జీవిత రాజశేఖర్లు ఈ రోజు కోర్టులో చెప్పారు. దీంతో కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జీవిత రాజశేఖర్లు కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తన బద్దశత్రువు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలిపేయడంతో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసుకు పూర్తిగా దూరమయ్యారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొంతకాలం ఉన్నారు. అక్కడ వారు ఎక్కువ కాలం కొనసాగలేక పోయారు. ఆ తర్వాత టిడిపి, బిజెపిల వైపు చూసినా సాధ్యం కాలేదు. మరోవైపు ఓ రాజ్యసభ సభ్యుడి మధ్యవర్తిత్వంతో వీరు కాంగ్రెసులోనే ఉండిపోయారని వార్తలు వచ్చాయి. చిరంజీవి ఉన్న కాంగ్రెసు పార్టీలోనే ఉంటూ ఆయనతో వైరం ఎందుకనే ఉద్దేశ్యంతోనో లేక మరే కారణం వల్లనో జీవిత రాజశేఖర్లు మెగాస్టార్తో రాజీకి వచ్చి ఉంటారని అంటున్నారు. జగన్తో బెడిసి కొట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెసులో చేరడం, ఆ తర్వాత చిరుతో రాజీ కుదరడం జరిగిందని చెబుతున్నారు.