రాజకీయాల్లో నారాలోకేష్ 'షో': మొదటిసారి అధికారికం!
హైదరాబాదు నుండి కుప్పం చేరుకున్న నారా లోకేష్ వి.కోటలో రోడ్ షో నిర్వహించారు. పదవ తేది వరకు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెసు హయాంలో ఛార్జీలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అండగా ఉంటుందన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడమే అసలైన ఉపాధి అన్నారు.
అభివృద్ధి అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసి చూపించామన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే రూ.150 కోట్లతో కుప్పంను అభివృద్ధి చేస్తామని చెప్రారు. పేదల కోసం తపించే నేతకు అధికారం ఇవ్వాలని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆయన పార్టీని సమన్వయం చేస్తున్నారు.
పూర్తి రాజకీయాలపై దృష్టి
అప్పుడప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చి కార్యకర్తలతో భేటీ అవుతున్న నారా లోకేష్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఈ మూడురోజులు కుప్పంలోనే ఉంటే కార్యకర్తలతో భేటీ కానున్నారు. కుప్పంతో పాటు చిత్తూరులో పార్టీ పట్టు కోసం ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్యాడర్లో ఉత్సాహం నింపితే అది సాధారణ ఎన్నికలకు కూడా పనికొస్తుందని భావిస్తున్నారు. లోకేష్ పర్యటనపై పార్టీ కార్యాలయం తొలిసారిగా అధికారిక ప్రకటన చేయడం చూస్తుంటే లోకేష్ ఇక పూర్తిస్థాయిలో పార్టీపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.