13 కత్తిపోట్లు, కసికొద్దీ చంపారు: ప్రేమే నేరమై హత్య

Man stabbed 13 times: Auto driver stabbed to death
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రెండు వేర్వేరు చోట్లు రెండు హత్యలు జరిగాయి. ఇద్దరిని కూడా పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. సరూర్‌నగర్ మండలంలోని మధురాపురి కాలనీకి చెందిన శేఖర్‌గౌడ్ (26) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఇతడు బాలాపూర్‌లో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఇతడికి కల్పనతో వివాహమైంది.

మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉండగా ఫోన్ రావడంతో ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. 11 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో అతడి తండ్రి, భార్య ఫోన్ చేయగా వస్తున్నానంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత అతడు ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

బుధవారం ఉదయం మీర్‌పేటలోని ప్రభుత్వ భూమిలో వ్యక్తి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వివరాలు సేకరిస్తుండగానే, శేఖర్ కుటుంబసభ్యులు అక్కడకు వచ్చారు. మృతదేహం శేఖర్‌దిగా గుర్తించారు. మృతుడి శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బండరాయితో మోదినట్టు ఉంది. వనస్థలిపురం ఏసీపీ రామచంద్రారావు, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. పంచనామా అనంతరం శవాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పథకం ప్రకారమే హత్య

శేఖర్‌ను చంపడానికి కొందరు దుండగులు ముందుగానే పథకం రూపొందించుకున్నట్టు తెలిసింది. మంగళవారం రాత్రి శేఖర్, బాబీ అనే వ్యక్తితో కలిసి ఉండడం చూశామని స్థానికులు కొందరు పోలీసులకు చెప్పారు. బాబీ కొంతకాలంగా శేఖర్‌తో స్నేహంగా ఉంటున్నాడని సమాచారం. మంగళవారం రాత్రి మీర్‌పేటలోని ఓ బార్‌లో ఇద్దరూ కలిసి మద్యం తాగినట్టు తెలిసింది. గతంలో శేఖర్, బాబీ సోదరితో చనువుగా ఉండేవాడని, ఆమెను పెళ్లి చేసుకుంటానని అప్పట్లో చెప్పాడని సమాచారం. శేఖర్ నాలుగు నెలల క్రితం కల్పనను వివాహం చేసుకోవడంతో, బాబీ అతడిపై కక్ష పెంచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అతడితో స్నేహంగా ఉంటూనే, తన మిత్ర బృందంతో కలిసి పథకం ప్రకారం మద్యం తాగించి ఆ తర్వాత మట్టుపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బాబీ కనిపించకుండా వెళ్లిపోవడం, పోలీసులు ప్రగతినగర్‌లోని బాబీ ఇంటికి వెళ్లి పరిశీలించగా తలుపు మీద రక్తం మరకలు ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాబీ ఒక్కడే హత్య చేసి ఉండడని, ఇద్దరు లేదా ముగ్గురు అతడికి సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఆటో డ్రైవర్ దారుణ హత్య

సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని అల్లావుద్దీన్ కోఠిలో బుధవారం ఉదయం ఆటో డ్రైవర్ షేక్ ఆరిఫ్ (23) హత్యకు గురయ్యాడు. బుధవారం ఆరిఫ్ ఇంటి నుంచి ఆటో తీసుకొని బయటకు వెళుతుండగా అదే బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ జమీల్ (21) అడ్డగించి కత్తితో దాడి చేశాడు. తీవ్రమైన గాయాలైన ఆరిఫ్ బస్తీలో ఉంటున్న స్నేహితుడు జహంగీర్ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అతడ్ని జహంగీర్ మొదట బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. సమయం లేకపోవడంతో ఎర్రగడ్డలోని నీలిమ ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో ఆరిఫ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆరిఫ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. బార్కాస్‌లో ఉండే ఓ యువతిని కొన్ని నెలలుగా ఆరిఫ్, మహ్మద్ జమీల్ ప్రేమిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి, హత్యకు దారితీసినట్టు సనత్‌నగర్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+