సభ వాయిదా: రాత్రంతా అసెంబ్లీలోనే టిడిపి ఎమ్మెల్యేలు!

తెలంగాణ నేతల అరెస్టులపై శుక్రవారం ఉదయం శాసనసభ దద్దరిల్లింది. ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైంది. విపక్షాలు వివిధ సమస్యలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. స్పీకర్ వాటిని తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాలకు స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఎంతకు వినక పోవడంతో సభను మొదట పది గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం పదిగంటలకు సభ ప్రారంభమైంది. సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణవాదుల అరెస్టుపై మండిపడ్డారు. తెరాస సభ్యులకు ఇతర సభ్యులు జత అయ్యారు. తెరాస సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు రెండోసారి వాయిదా వేశారు. ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. అయితే, ప్రజా సమస్యలపై చర్చించకుండానే సభను వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి సభ్యులు సభలోనే కూర్చున్నారు. విద్యుత్ సమస్యలపై రేపు చర్చిస్తామని హామీ ఇస్తే కదులుతామని చెప్పారు. ప్రస్తుతం టిడిపి సభ్యులు వెల్లోనే సభలోనే కూర్చున్నారు. రాత్రంతా సభలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
అంతకుముందు తెరాస సభ్యులు తెలంగాణవాదుల అరెస్టును నిరసిస్తూ ట్యాంకుబండ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వం కించపర్చేలా వ్యవహరిస్తోందన్నారు. అరెస్టు చేసిన తెలంగాణ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు అంబేడ్కర్ విగ్రహం నుండి సభకు పాదయాత్రగా నల్లగుడ్డలు ధరించి నిరసన తెలుపుతూ వచ్చారు.
సిబిఐ కాంగ్రెసుకు తొత్తులా వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తితో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడటం లేదన్నారు. తనను వ్యతిరేకించిన పార్టీలను వేధించేందుకు కాంగ్రెసు సిబిఐను వినియోగిస్తోందని విమర్శించారు. డిఎంకె నేత స్టాలిన్ నివాసంపై జరిగిన దాడులతో సిబిఐ కాంగ్రెసుకు మధ్య బందం బయటపడిందన్నారు.
లోకసభలోను తెలంగాణం
లోకసభలోను తెలంగాణపై రగడ జరిగింది. సడక్ బందులో పాల్గొన్న తెలంగాణవాదులపై అక్రమ కేసులు పెట్టారంటూ తెలంగాణ ప్రాంత ఎంపీలు సభలో ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications