జగన్, వైఎస్ దుర్యోదన, దృతరాష్ట్రులు: బాబు, కెవిపిపై..
మహాభారతంలో ధృతరాష్ట్రుడిలా.. వైయస్ ఈ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారని, ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడితో తప్పులు చేయించినట్లు వైయస్ కూడా జగన్తో అనేక అక్రమాలు చేయించాడని, అధర్మంగా రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. వారి దోపిడీకి రాష్ట్రంలో పేదలకు దక్కాల్సిన నిధులు ఆవిరై పోయాయని కానీ మహాభారతంలో చివరికి ధర్మమే గెలిచిందన్నారు. వైయస్, కాంగ్రెస్ అక్రమాలపై ఇప్పుడు తమ పార్టీ అలాంటి ధర్మపోరాటమే చేస్తోందన్నారు. ఈ పోరాటానికి అందరూ సహకరించాలని, తప్పకుండా గెలుస్తామన్నారు.
వైయస్ ఆత్మ కెవిపి రామచంద్ర రావును విచారిస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కెవిపిని సిబిఐ ప్రశ్నించిన ఉదంతాన్ని పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించారు. "వైయస్ ఆత్మ సిబిఐ ఎంక్వయిరీకి వెళ్లింది. పరలోకంలో ఉన్న ఆత్మ చేసిన అక్రమాలు, ఆయన కొడుకు చేసిన అక్రమాలు ఈ విచారణలో బయటకు రావాలి'' అన్నారు. రాజకీయాలకు వైయస్ కుటుంబం కళంకం తెచ్చిందని మండిపడ్డారు.
మతం ముసుగులో వైయస్ అల్లుడు అక్రమాలకు పాల్పడుతున్నారని, విజయమ్మ తమ్ముడు ఎరువుల్లో మట్టి కల్తీచేసి అమ్ముతున్నాడని, రాజకీయాలలో ఇన్ని దారుణాలకు ఏ కుటుంబమూ పాల్పడలేదన్నారు. పోలవరం పేరుతో సమాంతర కాల్వలు తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఘనత వైయస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని దుయ్యబట్టారు.
టిడిపి కార్యకర్తలూ, ప్రజలూ నిర్లక్ష్యం, నిర్లిప్తత విడనాడి కాంగ్రెస్ అక్రమాలతో జరుగుతున్న నష్టాలను అందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కాగా, పాదయాత్రకు ఆదివారం చంద్రబాబు విరామం ఇవ్వనున్నారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ శనివారం పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలిశారు. ఈ రోజు చంద్రబాబు వారితోనే గడుపుతారు.