ఇబ్బంది ఉంది, బురద చల్లుకుంటే కాదు: సిఎం

జలవిద్యుదుత్పత్తి తగ్గడం వల్ల, తగినంత గ్యాస్ అందకపోవడం వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా గ్యాస్ ద్వారానే విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని, విద్యుదుత్పత్తి తగ్గడం వల్ల వ్యయం పెరుగుతోందని ఆయన అన్నారు. ఇందన సర్దుబాటు కొత్తేమీ కాదని, 2003 నుంచి జరుగుతున్నదే అని ఆయన అన్నారు. 2006 - 2008 మధ్య కాలంలో ఇంధన సర్దుబాటు జరగలేదని, జలవిద్యుదుత్పత్తి బాగా జరిగినప్పుడు ఇంధన సర్దుబాటు జరగలేదని ఆయన వివరించారు.
ఈ ఏడాది విద్యుత్తు విషయంలో కష్టమైన సమయమని, గత 30 ఏళ్లలో ఇంత తక్కువ విద్యుదుత్పత్తి ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. గ్యాస్, నీటి ద్వారా 14 శాతం విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని, మిగతాది ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. హర్యానా నుంచి 180 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణకు నీటి వసతి లేదు కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కువ విద్యుత్తు ఇస్తున్నామని, దీన్ని వేరే విధంగా చూడవద్దని ఆయన అన్నారు. విద్యుత్తు కొనుగోలులో అవినీతి ఏమీ లేదని ఆయన అన్నారు. ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా 6,045 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్న ఘనత తమదేనని ఆయన అన్నారు. రోజుకు 60 మిలియన్ యూనిట్ల కొరత ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది అదనంగా 2 వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది 4500 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు
గ్యాస్ ఎరువుల రంగానికి కాకుడా విద్యుత్తు రంగానికి ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. రాష్ట్రానికి గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఈ ఏడాది ఆఖరులోగా అది అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. రైతులకు విద్యుత్తును అందించడంలో వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కెజి బేసిన్ డి6 ద్వారా గ్యాస్ అందడం లేదని ఆయన చెప్పారు. దీని గురించి కేంద్రం విచారిస్తోందని చెప్పారు. ఎక్కడ వీలుంటే అక్కడి నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అదనపు విద్యుత్తు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన అన్నారు.
తక్కువ ధరకు రాష్ట్రం విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని, అయినా అవినీతి జరుగుతోందనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. సంపన్నులకు మాత్రమే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని, పేదలకు పెరగడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications