కప్పట్రాళ్ల వర్గం చేరిక: బొత్స సత్తిబాబుపై కోట్ల గరం
తెలుగుదేశం పార్టీ నేతగా ఉంటూ ప్రత్యర్థుల చేతిలో దారుణహత్యకు గురైన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు సోదరుడి కుమారుడు కప్పట్రాళ్ల పరప్పనాయుడు తన వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. కప్పట్రాళ్ల పరప్పనాయుడు తన వర్గీయులతో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో తనతో మాటమాత్రంగా కూడా సంద్రించకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిర్ణయం తీసుకోవడంపై జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హయాంలో పార్టీ కోసం పని చేసిన అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు హత్యకు గురైన విషయం బొత్సకు ఏం తెలుసునని మంత్రి కోట్ల ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ఆస్తులు కోల్పోయి చివరకు ప్రాణాలు త్యాగం చేశారని వారి సేవలను స్మరించుకోవాల్సిందిపోయి, అంత దారుణానికి కారకులైన కప్పట్రాళ్ల వర్గాన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన మండిపడుతున్నారు.
ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ద్వారా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కోట్ల వర్గీయులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధిష్ఠానంతో మాట్లాడతానని కోట్ల తన వర్గానికి నచ్చజెబుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి సలహా మేరకు ఏకపక్ష నిర్ణయం తీసుకుని కప్పట్రాళ్ల వర్గాన్ని పార్టీలో చేర్చుకోవడం చెల్లదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓ దినపత్రిక ప్రతినిధితో అన్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు తాను పడుతున్న శ్రమ నీరజ, బొత్స చర్యలతో బూడిదలో పోసిన పన్నీరైందని కోట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కప్పట్రాళ్ల వర్గం పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ అధిష్ఠానం పెద్దలతో సంప్రదించి వారి చేరికను రద్దు చేయిస్తానని వెల్లడించారు. కప్పట్రాళ్ల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తాను అండగా ఉంటానని మంత్రి కోట్ల స్పష్టం చేశారు.