జగన్పై మరోసారి ఈడి కొరడా!: అరెస్టులకు అవకాశం

జగన్ కంపెనీలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరపున అన్ని పనులు జరుగుతాయని తమను నమ్మించారని, ఈ క్రమంలో బెదిరింపులు కూడా ఎదురయ్యాయని, అందువల్లే పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని వీరంతా గతంలో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. తమకు నష్టం జరిగిందని కూడా తెలిపారు. దీనిపై గత కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్న ఈడి మంగళవారం జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డిని మరోమారు ప్రశ్నించింది.
దీంతో విచారణ పూర్తయినట్లేనని, ఈ వారంలోనే సుమారు రూ.51 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసే అవకాశముందని సమాచారం. వాన్పిక్కు భూముల కేటాయింపునకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారని గతంలో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ఈడి దృష్టి సారించింది. మరో రెండు నెలల్లో దీనికి సంబంధించి రూ.841 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ ఆస్తుల జప్తుపైనే దృష్టి కేంద్రీకరించిన ఈడి ఇక చార్జిషీట్ల నమోదుకూ సిద్ధమవుతోంది. జప్తు అనంతరం దానిపై ఈడి న్యాయ నిర్ణయాధికార సంస్థ వద్ద కేసు నమోదవుతుంది. దీనిపై ఇరు వర్గాల వాదోపవాదాలు విన్న తర్వాత ఆ సంస్థ తన తీర్పు వెలువరిస్తుంది. తొలి విడత జరిగిన జప్తుకు ఈడి న్యాయ నిర్ణయాధికార సంస్థ ఆమోదం తెలిపింది. జప్తుపై న్యాయ నిర్ణయాధికార సంస్థ ఆమోదం పడిందంటే ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న నేరాలు దాదాపు రుజువైనట్లేనంటున్నారు.
సిబిఐ నేరానికి ప్రాధాన్యం ఇస్తే, ఈడి నేరానికి సంబంధించిన చర్యలకు (ఆస్తులు, వగైరా) ప్రాధాన్యం ఇస్తుందట. జగన్ కేసుతో ముడిపడిన అన్ని ఆస్తులను విక్రయించకుండా, కొనుగోలు చేయకుండా ఈడి చర్యలు తీసుకున్నదట. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడి చార్జిషీటు దాఖలు చేస్తే అది హైదరాబాద్లోని పిఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టులోనే దాఖలవుతుందని ఈడి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, చార్జిషీటు తర్వాత అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుల్లో బెయిల్ దొరకడం కష్టమే అంటున్నారు.












Click it and Unblock the Notifications