స్థానిక జోష్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్
గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లీస్ బీదర్, బసవకల్యాన్ల్లో మూడేసి వార్డులను గెలుచుకుంది. శాసనసభ ఎన్నికల్లో కూడా తాము బలాన్ని చాటుకుంటామని మజ్లీస్ సీనియర్ నేతలు అంటున్నారు. పార్టీని విస్తరించే వ్యూహంలో భాగంగా ముస్లింల జనాభా అధికంగా ఉన్న బీదర్, బసవకల్యాణ్ల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు మజ్లీస్ నాయకులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి కర్ణాటక ఎన్నికల్లో పోటీ ఉపయోగపడుతుందని మజ్లీస్ నాయకులు భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 17. అయితే, మజ్లీస్ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. మజ్లీస్ బహుముఖ పోటీలో ఇతర పార్టీలతో తలపడాల్సి ఉంటుంది.
బిజెపి, యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ (కెజెపి), బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ), కాంగ్రెసు, జెడి (ఎస్), బి. శ్రీరాములు బదవ శ్రామిక రైత (బిఎస్సార్), మక్కర్ పక్ష పార్టీలతో మజ్లీస్ పోటీ పడాల్సి ఉంటుంది. మజ్లీస్ పోటీ వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయి, ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ముస్లిం అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. బీదర్ రూరల్, ఇతర సెగ్మెంట్లలో పోటీ చేద్దామని నాయకులు తనను అడుగుతున్నారని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అన్నారు. అయితే తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.