బూటకం: టైమ్స్ నౌ సర్వేపై జగన్ పార్టీ నేతలు ఫైర్
కొన్ని చానెళ్లు తప్పుడు సర్వేలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన అన్నారు. టైమ్స్ నౌ సర్వేతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అండ్ కో చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి 9 ఎంపి స్థానాలు వస్తాయని సర్వే చెప్పినట్లు వార్తలు వచ్చాయని, బహుశా అవి శానససభా స్థానాలు కావచ్చునని ఆయన అన్నారు.
ఇలాంటి సర్వేలను నమ్మితే చంద్రబాబు కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీ రామరావు తర్వాత తెలుగుదేశం పార్టీలో మిగిలిందేమీ లేదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన అన్నారు. కేంద్రంలో కీలక పాత్ర తమ పార్టీదేనని అంబటి రాంబాబు అన్నారు.
2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ సర్వే లెక్కలు తప్పాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో నేత కొణతాల రామకృష్ణ అన్నారు. అప్పుడు కాంగ్రెసుకు 15, మహాకూటమికి 22 ఎంపి సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే వెల్లడించిందని, ఎన్నికల తర్వాత కాంగ్రెసుకు 33, మహాకూటమికి 5 సీట్లు వచ్చాయని ఆయన తెలిపారు. సర్వే ఎంత నిజాయితీగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. సర్వేలో ప్రకటించినట్లు వైయస్ జగన్ గ్రాఫ్ క్రమేపీ తగ్గడం లేదని అన్నారు. దమ్ముంటే తక్షణమే ఉప ఎన్నికలు జరిపి ప్రజల తీర్పు తెలుసుకోవాలని కొణతాల సవాల్ విసిరారు.
టైమ్స్ నౌ సర్వే ప్రజలు నమ్మే విధంగా లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి అన్నారు. సర్వేను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరిగినట్లు లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో తమ పార్టీకి 25 నుంచి 30 స్థానాలు వస్తాయని ఆయన దీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని మైసురారెడ్డి అన్నారు.