దేవుడే నిర్ణయిస్తాడు, చిరుపై కాదు: మోహన్ బాబు
తిరుపతి: తన రాజకీయ ప్రస్థానాన్ని దేవుడే నిర్ణయిస్తాడని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఆయన బుధవారంనాడు ఆ వ్యాఖ్య చేశారు. తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని పరామర్శించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి చిరంజీవిని ఉద్దేశించినవి కావని, అసలు చిరంజీవిని తను ఏమీ అనని ఆయన అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి మంచి సంబంధాలున్నాయని, ఏ పార్టీతో విబేధాలు లేవని మోహన్బాబు స్పష్టం చేశారు. ఏ పార్టీలోకి వచ్చేది ఆ దేవుడే నిర్ణయిస్తాడని, రాజకీయంగా తన గురువు ఎన్టీఆర్ అని చెప్పారు.
ఇదే సమయంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో 730 ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని మోహన్ బాబు అన్నారు.
రాజకీయ పార్టీల తీరు వల్లనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ తరహాలో ఇక్కడ కూడా కఠిన శిక్షలు వేస్తే అత్యాచారాలు జరగవని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో చేరేది ఇప్పుడు చెప్పబోనని ఆయన అన్నారు.