ఎమ్మెల్యే ఈలి నాని కూతురు ప్రేమ పెళ్లి సుఖాంతం
గుంటూరు: తాడేపల్లిగూడెం శాసన సభ్యుడు ఈలి నాని కూతురు రమ్య, ఆమె భర్త సందీప్ల ప్రేమ - పెళ్లి వివాహం సుఖాంతమైంది. ఈ రోజు గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందు రమ్యతో పాటు సందీప్లు హాజరయ్యారు. సందీప్ను తీసుకు రావాలని రమ్య పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు సందీప్ను లీగల్ అథారిటీ సెల్ ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా రమ్యను, సందీప్ను కోర్టు ఒక్కటి చేసింది.
కాగా, తన తండ్రి తనను మూడేళ్లు గృహనిర్బంధం చేశారని, ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త సందీప్ను కలవకుండా చేశాడని రమ్య ఆరోపించిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం తాను అదృశ్యమయ్యానని తన తండ్రి ఫిర్యాదు చేశారని, తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఆమె గుంటూరులో మీడియా ఎదుట ప్రత్యక్షమయ్యారు. అనంతరం లీగల్ సెల్లో ఫిర్యాదు చేశారు. జడ్జి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే నాని బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉద్వేగానికి లోనై మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కూతురు విషయంలో తాను ఎప్పుడు అడ్డు చెప్పలేదని కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నానని ఆయన అన్నారు. కూతురు కనిపించకుంటే ఎవరైనా కేసులు పెడతారని, అలాగే తన బంధువులు కూడా తన కూతురు రమ్య కనిపించక పోవడం వల్ల కేసులు పెట్టారన్నారు.
తన కూతురును ఓసారి చూపించి తీసుకు వెళ్లాలని ఆయన కోరారు. ఇక జీవితంలో తాను రమ్య విషయంలో జోక్యం చేసుకోనని చెప్పారు. తన కుటుంబంలోని వ్యక్తులు కూడా రమ్యకు ఎలాంటి అడ్డు చెప్పారని ఈలి నాని హామీ ఇచ్చారు. ఓ ఛానల్లో తన తండ్రి తనను బాగానే చూసుకున్నారని చెప్పిన రమ్య మరో ఛానళ్లో మాత్రం వేధిస్తున్నారని చెప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతురు విషయంలో జరుగుతున్న సంఘటనలు తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించాయన్నారు.
తన కూతురుకు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటే తాను ఎప్పుడో చేసేవాడినని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. ఇప్పటికి ఆరు సంబంధాలు చూసినా చేసుకోలేదన్నారు. తాను తిరుపతిలో ఉండగా రమ్య అదృశ్యమైందని తన భార్య ఫోన్ చేసి చెప్పిందన్నారు. రమ్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పెంచామని చెప్పారు.