వెళ్లి కూర్చోండి!: సోనియా హెచ్చరికతో టిఎంపీలు సైలెన్స్

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లోకసభలో ఆందోళన చేశారు. వారిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వారించారు. దీంతో వెనక్కి తగ్గారు. మంగళవారం పార్లమెంటు రెండో రోజు సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. పలుమార్లు ఉభయ సభలు వాయిదాపడ్డాయి.

లోకసభలో నలుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వివేక్, మంద జగన్నాథం, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌లు తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు. వారు తమ స్థానాలను వదిలి ముందుకు వచ్చారు. వారిని చూసిన సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారు తగ్గారు.

కాగా, మంగళవారం పార్లమెంటులో ప్రధాని రాజీనామాకు బిజెపి పట్టుబట్టడంతో గందరగోళం చెలరేగి.. ఉభయసభలు గంటపాటు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత సోనియా నేతృత్వాన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. విపక్షాల దాడి నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఇందులో చర్చించారు. బొగ్గుగనుల కేటాయింపు కుంభకోణంలో ప్రభుత్వంపై దాడిని బీజేపీ ఉధృతం చేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్ రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేసింది.

సీనియర్ నేత అద్వానీ నాయకత్వాన సమావేశమైన బిజెపి పార్లమెంటరీ పార్టీ ఈ మేరకు ఓ తీర్మానం ఆమోదించింది. సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించాల్సిన అఫిడవిట్‌లో దిద్దుబాట్లు చేసిన విషయంపై న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్ ప్రకటన చేయాలని రవిశంకర్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధాని రాజీనామా చేయాల్సిందేనని, న్యాయమంత్రిని తొలగించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. తమ డిమాండ్‌ను తిరస్కరించిన తీరులో సోనియాగాంధీ 'అహంకారం' స్పష్టమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

సిబిఐ నివేదికలో అశ్వనీకుమార్ కేవలం వ్యాకరణ తప్పులు మాత్రమే సరిదిద్దుతున్నారన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేశారు. చివరకు తన ఇంగ్లీషును సరిదిద్దుకోడానికి న్యాయశాఖ మంత్రివద్ద సిబిఐ ప్రైవేటు పెట్టించుకోవాలా అని ఎద్దేవా చేశారు. ఇక సిపిఐ సీనియర్ నేత, ఎంపి గురుదాస్ దాస్‌గుప్తా కూడా బిజెపి డిమాండును సమర్థించారు. దేశానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంలో ప్రధాని విఫలమయ్యారని అన్నారు.

మరోవైపు బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారం అధికార, విపక్షాల మధ్య మాటలదాడి తీవ్రతను పెంచుతోంది. ప్రధాని రాజీనామా డిమాండ్‌ను సోనియా తోసిపుచ్చడమే కాక.. 'వాళ్లను అడుగుతూ ఉండనివ్వండి' అనడంతో బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సోనియా 'అహంకారం' దీంతో స్పష్టమవుతోందన్నారు. కోల్‌గేట్ స్కాంపై ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా సోనియా చలించలేదు. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్లను ఆమె ఒక్క మాటతో తోసిపుచ్చారు.

కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం అనంతరం.. ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారుగా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు 'వాళ్లను అడుగుతూ ఉండనివ్వండి' అని సరిపెట్టేశారు. ఇక ప్రభుత్వం కూడా బిజెపి డిమాండ్‌ను తోసిపుచ్చింది. ప్రధానిపై బిజెపి చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు. కీలకాంశాల నుంచి దృష్టి మళ్లించడానికే ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+