ఇరకాటంలో జగన్: అత్యుత్సాహమా, అధిష్టానం అండా?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏదో రకంగా మీడియాలో నానాలని తద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాలని మొదటి నుండి చూస్తుందనే వాదన ఉంది. ఓదార్పు నుండి ఎమ్మెల్యేలతో దోబూచులాట వరకు జగన్ మైండ్ గేమ్ ఆడి మీడియాలో పెద్ద ఎత్తున నానారు. అయితే, ఇటీవల ఆ పార్టీ ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని సర్వేల ద్వారా తెలిసింది. జగన్ జైలుకు వెళ్లాక పార్టీలో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి.
జగన్ బయటకు రావడం కోసం వారు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆశించిన స్థాయిలో లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో జగన్లాగే పార్టీ నేతలు ఫ్లెక్సీల ద్వారా చర్చకు తెరలేపి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని ఉపయోగించుకోవడాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు తదితరుల ఫోటోలను ఉపయోగించుకోవడం నిత్యం ప్రజల నాలుకల పైన ఉండవచ్చుననే అభిప్రాయంతోనే వారు అలా చేస్తున్నారంటున్నారు. అయితే, ఇంతలా రాద్దాంతం జరుగుతున్నా వరుసగా ఫ్లెక్సీలు వినియోగించటం వెనుక అధిష్టానం అండ లేకుండా జరగదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇతర పార్టీల నేతలు, హీరోల ఫోటోలు వాడినప్పుడు అధిష్టానం వారిని గట్టిగా హెచ్చరించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదంటున్నారు. దీన్ని బట్టి అధిష్టానం అండ ఉండి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆయా నియోజకవర్గాల నేతలు ప్రచారం పొందడం కోసం అత్యుత్సాహంతో కూడా చేస్తుండవచ్చునని చెబుతున్నారు. అధిష్టానం అండతో జరుగుతుందని, ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పడేసేందుకు వ్యూహంలో భాగమని, స్థానిక నేతల అత్యుత్సాహమని ఇలా పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేతల అత్యుత్సాహం కారణంగా జగన్ను ఇరకాటంలో పడేస్తున్నారని కూడా అంటున్నారు.