మాట తప్పం మడప తిప్పం!: జగన్ వైయస్లా కాదా?
తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్య నేత అయిన కొండా సురేఖ అసంతృప్తి కారణంగా దూరంగా ఉంటున్నారనే వాదన కొద్దికాలంగా ఉంది. అన్ని జిల్లాల్లోని నేతల పరిస్థితి ఇలాగే ఉందట. సమన్వయకర్తల నియామకం వల్లనే జగన్ పార్టీలో అసంతృప్తుల బెడద ఎక్కువయిందంటున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా, బయట అధిష్ఠానం పెద్దలుగా చలామణి అవుతున్నవారి పోకడలతో తెలంగాణలోని చాలామంది నేతలు రగిలిపోతున్నారట.
నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం మొదలు, పార్టీ ఈ ప్రాంతంలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన వరకు ఎందులోనూ తమ భాగస్వామ్యం లేకపోవడాన్ని కొందరు అవమానంగా భావిస్తున్నారట. డబ్బున్న వారికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రజల్లో బలంగా ఉన్నవారినీ పక్కన పెడుతున్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయట. జగన్ పార్టీలో చేరి తప్పు చేశామని, గోతిలో పడ్డామని ఆవేదన చెందుతున్నారట.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాట ఇస్తే కాదనకపోయేవాడని, జగన్ మాత్రం అలా కాదని సొంత పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. వైయస్లా జగన్ కాదనే విషయం తెలియక బోల్తా పడ్డామని ఆవేదన చెందుతున్నారట. మొదటి నుండి పార్టీలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యం లేదని ఆందోళన చెందుతున్నారట. అందుకే పలువురు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదంటున్నారు. కొందరు నేతలకు మొదటి నుండి టిక్కెట్ పైన హామీ ఇచ్చి ఆ తర్వాత నాన్ లోకల్ అంటూ పక్కన పెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రకాశం జిల్లా అద్దంకిలా ఈ సమస్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
జగన్ కోసం మంత్రి పదవి వదులుకున్న కొండా సురేఖ, పార్టీ దక్షిణ తెలంగాణ ఇన్చార్జి జిట్టా బాలకృష్ణా రెడ్డి, బాజిరెడ్డి, అజయ్లు సైలెంటయిపోయారంటున్నారు. మరోవైపు షర్మిల యాత్ర నుంచి విజయమ్మ రచ్చబండ దాకా తెలంగాణలో షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం నుంచి ఈనెల 27న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విజయమ్మ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వరకు ఏదీ ఇక్కడి నేతలకు ముందస్తు సమాచారం లేదని, అందుకే దూరంగా ఉండాలని ఈ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు భావిస్తున్నారట.