చంద్రబాబూ!సిగ్గు లేదా?, తెలుగుదేశం ఖాళీ: కెసిఆర్
తొలుత కరీంనగర్ తెలుగుదేశం శాసనసభ్యుడు గంగుల కమలాకర్కు పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వనించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ వారిని నియమిస్తారా, తెలంగాణ వ్యక్తిని ముఖ్య మంత్రిని చేస్తారా అని ప్రశ్నించారు. ఇటువంటి పార్టీల్లో కొనసాగడం ఇష్టంలేకే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ తెలంగాణ సాధించేపార్టీ తెరాసలో చేరారని అన్నారు. కమలాకర్ బాటలో మరి కొంతమంది పార్టీలో చేరేందుకు సిధ్దంగా ఉన్నారని మే ఆఖరు నాటికి తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని ఆయన అన్నారు.
పేరుకే కాంగ్రెస్ జాతీయ పార్టీ అని 57 సంవత్సరాల కాలంలో ఐదేళ్ల పాటు తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వ లేదని ఆయన అన్నారు. ఇన్నేళ్ల కాలంలో కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగున్నరేళ్లు మాత్రమే ముఖ్యమంత్రులుగా కొనసాగారని అన్నారు. ఇటీవల జరిగిన శాసన సమావేశాల్లో తెరాస ఉపనేత హరీష్ రావు తెలంగాణకు నిధుల కోసం ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకొంటారో చేసుకోమని ఆహంకారంతో మాట్లాడడం తెలంగాణ ప్రజలను అవమానించారని అంటూ ఇటు వంటి పార్టీకి ఓటేయడం అవసరమా అని ప్రశ్నించారు.
బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి తెలంగాణ సంపదను ఆంద్రప్రాంతానికి దోచుపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆంద్రప్రాంతంలో ఉన్న ఖనిజాసంపదను ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. భయ్యారంలోనే ఉక్కుపరిశ్రమ నెలకొల్పాలని ఉద్దేశముంటే వరంగల్ జిల్లా గూడూరు ఖనిజాన్ని విశాఖ కు తరలించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
పోతిరెడ్డిపాడును వేల పోలీసు బలగాలను మోహరించి అక్రమంగా నిర్మించారని, పోలవరం ప్రాజెక్టును వైయస్ జగన్ కడుతారని విజయమ్మ అనడం ఆంధ్ర పార్టీల వైఖరికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రజలంతా ఒక్కటై ఆంధ్రపార్టీలను తరిమికొడితేనే తెలంగాణసా ద్యమవుతుందని, ఇందుకు ప్రజలంతా ఒక్కటై ఉద్యమించాలని అన్నారు.
దేశంలో సంకీర్ణ పార్టీల పాలనేనని రాబోయే రోజుల్లో కీలక రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్టస్రమితి ఎదుగుతుందని ఆంధ్రపార్టీల్లో వున్న తెలంగాణ వారు పార్టీలను వీడి ఉద్యమపార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. కరీం నగర్ ఎమ్మెల్యే గంగుల చేరికతో జిల్లాలో పార్టీకి బలం పెరిగిందని రానున్న శాసన సభ ఎన్నికల్లో కమాలకర్ను 70వేల మెజారిటీతో గెలిపించి తెలంగాణసత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.