విజయమ్మ 'టి' యాత్రపై తర్జన: పార్టీలోను మైండ్గేమే
ఇప్పటికే సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ధీటుగా ఎదిగింది. తెలంగాణ ప్రాంతంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరినప్పటికీ తెలంగాణవాదం నేపథ్యంలో పార్టీ పట్టు బిగించలేదు. దీంతో విజయమ్మ పర్యటన ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ గ్రామానికి తీసుకు వెళ్లాలని వైయస్సార్ కాంగ్రెసు భావిస్తోంది. ఓదార్పు లేదా బస్సు యాత్రపై చర్చలు సాగుతున్నాయట.
పార్టీలోను మైండ్గేమ్ తిప్పలు
ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైండ్ గేమ్ అడుతుంటుందనే విషయం తెలిసిందే! ఇదే మైండ్ గేమ్ను ఆ పార్టీ అధిష్టానం సొంత పార్టీ నేతల పైన కూడా ప్రయోగిస్తోందట. అధిష్టానం మైండ్ గేమ్ పైన నాయకులు అసంతృప్తి చెందుతున్నారట. పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మొదటి నుండి ఉండి డబ్బులు ఖర్చు పెట్టారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో స్థానికంలో ఇతర పార్టీల కంటే ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించిన వారికే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఉంటాయని హెచ్చరించిందట. స్థానిక ఎన్నికలలో ఎక్కువ స్థానాలలో గెలిపించకుంటే నియోజకవర్గ ఇంఛార్జి పదవి నుండి తొలగిస్తామని సూచనలు జారీ చేసిందట. ఇది ఆశావహులకు ఆగ్రహం తెప్పిస్తోందట. ఇప్పటికే పార్టీ కోసం బాగా ఖర్చు చేశామని, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించేందుకు ఇంకా ఎంత ఖర్చు చేయవలసి ఉంటుందోనని, ఒకవేళ ఖర్చు చేసినా గెలుస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారట.