Tamil Nadu: నిన్న విజయ్ చేసిన తప్పేంటి ? లోక్ భవన్ వర్గాల క్లారిటీ..!
తమిళనాడు (tamil nadu)లో ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ (vijay) టీవీకే (Tvk).. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వరుసగా మూడోసారి గవర్నర్ ను ఆశ్రయించింది. అయితే మూడోసారి కూడా గవర్నర్ అర్లేకర్.. విజయ్ వాదనతో సంతృప్తి చెందలేదు. దీని వెనుక ఉన్న కారణాలేంటో తమిళనాడు లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గతంలో రెండుసార్లు వివిధ కారణాలతో గవర్నర్ ను మెప్పించలేకపోయిన విజయ్.. ఈసారి చేసిన తప్పేంటో ఓసారి చూద్దాం..
శుక్రవారం విజయ్ 117 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించారని లోక్భవన్ (Lok bhavan)వర్గాలు తెలిపాయి. ఇందులో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ 5, వామపక్షాలు 4తో పాటు ఒక ఏఎంఎంకే ఎమ్మెల్యే సంతకాలను సమర్పించారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని విజయ్ కోరారు. అయితే అరగంటలో ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గవర్నర్కు ఫోన్ చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది.

విజయ్కు మద్దతుగా సమర్పించిన ఏకైక ఏఎంఎంకే ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ జరిగిందని దినకరన్ గవర్నర్కు తెలిపారు. ఈలోగా టీవీకే ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ను సంప్రదించడానికి ప్రయత్నించింది .. అయితే ఆయన స్పందించలేదు. గంటలోపే, ఆ ఏఎంఎంకే ఎమ్మెల్యే చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. దినకరన్తో కలిసి వారిద్దరూ గవర్నర్ను కలిసి, విజయ్ టీవీకే బేరసారాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఆ సంతకం తనది కాదని ఏఎంఎంకే ఎమ్మెల్యే చెప్పినట్లు సమాచారం. ఏఎంఎంకే ఎన్డీఏలో భాగంగా ఉందన్నారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 116కు తగ్గిందని, మెజారిటీ మార్కుకు రెండు తక్కువని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఐయూఎంల్ కూడా తాము విజయ్ కు మద్దతివ్వడం లేదని తేల్చేసింది.














Click it and Unblock the Notifications