జగన్కు ధీటుగా..: శేరిలింగంపల్లి నుండి నారా లోకేష్?
ప్రధానంగా తెలుగు తమ్ముళ్లు శేరిలింగపల్లి నుండి పోటీ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం లోకేష్ యువతను ఏకం చేస్తారని, ఆయన పోటీ చేసే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన పోటీకే అవకాశాలు లేనప్పుడు శేరిలింగంపల్లి, చంద్రగిరి అనే వాదనలో పస లేదంటున్నారు.
చాలామంది తెలుగు తమ్ముళ్లు మాత్రం లోకేష్ను వచ్చే ఎన్నికలలో పోటీ చేయించాల్సిందేనని పట్టుబడుతున్నారట. లోకేష్ పోటీ చేస్తే యువతను ఆకట్టుకోగల్గుతారని చెబుతున్నారట. ప్రస్తుతం యువత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోందని, రాజకీయాల్లోని అవినీతి అంశాలకు పక్కన పెట్టి యువ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఇలాంటి సమయంలో లోకేష్ పోటీ చేయడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చునని చెబుతున్నారట.
నారా లోకేష్ కూడా ప్రస్తుతం ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకున్నారు. మినీ మహానాడుల్లో పాల్గొంటున్న లోకేష్ యువ ప్రభంజనం సృష్టిస్తానని, యువతను, విద్యార్థులను ఏకం చేసి వారిలో చైతన్యం తీసుకు వస్తానని చెబుతున్నారు. జగన్ అవినీతిని, కాంగ్రెసు అవినీతి, అసమర్థ పాలనను యువతలోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని అంటున్నారు. మినీ మహానాడు ద్వారానే ఆయన దానికి తెరలేపారంటున్నారు.