కాంగ్రెస్ మాత్రమేనా?: టిడిపినే టార్గెట్ చేసిన కెసిఆర్!

నాంపల్లిలోని టిఎన్జీవో కార్యాలయంలో బుధవారం తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెసిఆర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఐకాస చైర్మన్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ టిడిపిని టార్గెట్ చేశారు. మిగతా విషయాలకంటే టిడిపిని టార్గెట్ చేయాలని చెప్పడానికే ఆయన ఈ భేటీకి వచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ మాదిరిగానే టిడిపిని దూరం పెట్టాలని, ఆ పార్టీని తెలంగాణ ఐకాస ఛాయలకు రాకుండా చూడాలని, అంతేకాదు తెలంగాణ ఐకాసలో ఆంధ్రా పార్టీలు వద్దే వద్దంటూ ఒక తీర్మానం చేయాలని ఐకాస నేతలకు సూచించారు. టిడిపి తెలంగాణపై ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారని, 2008లో తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని చెబుతోందని, అంటే వాళ్లు చెప్పేదాంట్లో కొత్తదనం ఏమన్నా ఉంద ? అంతా పాత విషయమేనన్నారు. ఆ పార్టీ వైఖరిలో అసలు స్పష్టతే లేదన్నారు.
బిజెపిలాంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోబోమంటూ టిడిపి చెబుతోందని, అసలు టిడిపితో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పామా, మాతో పొత్తు పెట్టుకోవాలని అడిగామా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారని, ఆయన బాగా చెప్పారని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా కెసిఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ వేదికగా ఆందోళనలను తీవ్రం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications