జగన్కు ఝలక్ ఇచ్చేనా?: కాంగ్రెస్తో బోడ మంతనాలు
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్, మాజీ మంత్రి వినోద్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బోడ జనార్ధన్కు కాంగ్రెసు పార్టీ గాలం వేస్తోంది. ఆయనతో కొద్ది రోజులుగా చర్చలు జరుపుతోంది. వివేక్, వినోద్లు తెరాసలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమైంది. దీంతో బోడను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ఆ ప్రాంత టి కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ... తనతో కాంగ్రెసు నేతలు మాట్లాడుతున్నది వాస్తవమే అన్నారు. వివేక్, వినోద్లు కాంగ్రెసు పార్టీని వీడుతున్న నేపథ్యంలో తనకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన చెప్పారు.
కాగా, బోడ జనార్ధన్ తెలుగుదేశం పార్టీ నుండి సంవత్సరంన్నర క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కడపలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెసు నేతలతో మంతనాలు జరుపుతున్నారు.