అన్నీ వైఎస్ పథకాలే: కిరణ్ని కడిగేసిన డిఎల్, ఇదా గిఫ్ట్

తాను ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదన్నారు. తాను గతంలోనే రాజీనామా చేశానని, అలాంటప్పుడు సిఎం తనను రాజీనామా కోసం అడగాల్సి ఉండెనన్నారు. తాను లంచాలు తీసుకున్నానా? కోర్టు కేసుల్లో ఉన్నానా? తనను ఎందుకు బర్తరఫ్ చేశారో చెప్పాలన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి ఎప్పుడూ లాయల్గా ఉంటానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఆజాద్ను కలిసి తన బాధ చెప్పుకున్నానని చెప్పారు.
తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎప్పుడు పాల్పడలేదన్నారు. పార్టీకి లాయల్గా ఉంటానని చెప్పారు. గతంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి రాజీనామా కోరితే ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు కిరణ్ కోరినా ఇచ్చేవాడినన్నారు. తనను బర్తరఫ్ చేస్తే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు భయపడతారని కిరణ్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడు ముఖ్యమంత్రితో సన్నిహితంగా లేనని చెప్పారు. తాను చెంచాల కింద పని చేయనని, అదే పరిస్థితి వస్తే రాజకీయాలే వద్దన్నారు.
పథకాల అమలు కన్నా పబ్లిసిటీ ఈ ప్రభుత్వానికి ఎక్కువ అని తాను సోనియాకు చెప్పానన్నారు. సబ్ ప్లాన్ కింద్ ఎంత మంది దళితులకు మేలు జరిగిందన్నారు. బంగారు తల్లి పథకం తీరు చూస్తుంటే కళ్లకు నీళ్లొస్తున్నాయన్నారు. దామోదర రాజనర్సింహ దళితుడు కాబట్టి ఆయనను పక్కన పెట్టి ముఖ్యమంత్రి సబ్ ప్లాన్ పైన తన ఫోటోతో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వైయస్ హయాంలోని పథకాలనే ముఖ్యమంత్రి పేర్లు మార్చి పెడుతున్నారని ఆరోపించారు.
బంగారు తల్లి పథకం, రాజీవ్ యువకిరణాలు, ఇందిర జలప్రభ.. ఇలా పలు పథకాలు వైయస్ హయాంలోనే ఇతర పేర్లతో ఉన్నాయన్నారు. వైయస్ ప్రవేశ పెట్టిన లక్ పతి పథకం దాదాపు ఎవరికి తెలియదన్నారు. వైయస్ హయాం నాటి పథకాలు కాంగ్రెసు పథకాలే అని తమ నేతలు చెబుతున్నారన్నారు. రాజీవ్ యువకిరణాల కింద ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పథకానికి పేరు పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి కిరణే అన్నారు.
ప్రచారం కోసం పెట్టిన ఖర్చు కూడా పథకాల కోసం పెట్టడం లేదన్నారు. ప్రస్తుత పథకాలు వైయస్ పథకాలు కాదని.. కాంగ్రెసు పథకాలన్నారు. వైయస్ తెచ్చిన రాజీవ్ ఉద్యోగ్ స్కీమే... రాజీవ్ యువకిరణాలు అన్నారు. ఆడపిల్ల పుడితే వైయస్ లక్ష రూపాయలు ఇచ్చే పథకం పెట్టారని, దానికంటే బంగారుతల్లి గొప్పదా అన్నారు. వైయస్ పథకాలనే కిరణ్ పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు.
బంగారుతల్లి పథకం నుండే తనకు, ముఖ్యమంత్రికి దూరం పెరిగిందన్నారు. తాను ఎప్పుడు ఎవరిని మంత్రి పదవి అడగలేదన్నారు. తనకిచ్చిన బాధ్యతను తాను నిర్వర్తించానని చెప్పారు. మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరిని తొలగించాలనేది ముఖ్యమంత్రికి హక్కు ఉంటుందన్నారు. కొందరు అధికారం దక్కుతుందనుకుంటే దొడ్డిదారిన ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
ఏ పరిస్థితుల్లో తనను కేబినెట్ నుండి తప్పించారని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తన వాదన వినిపించేందుకు సిఎల్పీ సహకరించలేదన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యంలో తనకు దురదృష్టకరమైన పరిణామం ఎదురయిందన్నారు. బ్రిటన్ను చూసి వచ్చిన తర్వాత ఇక్కడి పాలనపై తనకు ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యక్తుల పాలన నడుస్తోందా అని ఆయన మండిపడ్డారు.
మంచి చేయనప్పుడు ఇది మంచి కాదని, పద్ధతి మార్చుకోవాలని తాను సూచిస్తానని అన్నారు. మంచిని గుర్తించి మంచి చేయాలనే వ్యక్తిత్వం తనదన్నారు. తనను ఎందుకు డిస్మిస్ చేశారో ఇంకా వివరాలు తెలియదన్నారు. రాజీవ్ యువకిరణాలు ప్రారంభోత్సవ సమయంలో కిరణ్ తనను ఆవేదనకు గురి చేశారన్నారు. సిఎం కార్యాలయం నుండి తనకు పిలుపు రాలేదన్నారు. తనను గచ్చిబౌలి స్టేడియంలో కిరణ్ రిసీవ్ చేసుకున్న తీరు సరిగా లేదన్నారు.
ఏ శాఖ ఇచ్చినా పని చేస్తానని గతంలోనే చెప్పానని, శాఖలో కోత పెట్టినందుకు గతంలోనే రాజీనామా చేశానని, ఇలాంటి పరిస్థితుల్లో తనను ఎలా బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు. తాను ఇందిర, రాజీవ్ హయాం నుండి కాంగ్రెసులో పని చేశానన్నారు. తాను ఆత్మగౌరవం కలిగిన వ్యక్తినని, ఎక్కడా రాజీపడనన్నారు. తాను గతంలో సోనియా గాంధీకి లేఖ రాశానని, దానిపై ఆమె పిలిచి అడిగితే పార్టీ, ప్రభుత్వ తీరుపై చెప్పానని, ఎవరి పైన ఫిర్యాదు చేయలేదన్నారు.
పార్టీ మునిగిపోతుంటే తాను చూస్తూ ఊరుకోనని చెప్పారు. సోనియా గాంధీకి మంచి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని, తప్పు జరుగుతుందని తెలిస్తే తాను దేనిని లెక్క చేయనని అన్నారు. తాను పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉంటానని అన్నారు. సత్యశోధన పరీక్ష పెడితే ఎవరేమిటో తెలుస్తుందన్నారు. ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన మంత్రులంతా తనతో మాట్లాడారన్నారు.
రాజకీయాల్లో నైతికత ముఖ్యమన్నారు. తాను కాంగ్రెసు పట్ల నిబద్దత కలిగిన వ్యక్తినని చెప్పారు. తాను నేరుగా తన కార్యకర్తల వద్దకు వెళ్తానని, వారు ఏం చెబితే అది చేస్తానన్నారు. అవమానం జరిగిందని తన కార్యకర్తలు చెప్పి కాంగ్రెసులో ఉండమంటారా, బయటకు రమ్మంటారా లేక రాజకీయాల నుండి వైదొలగమంటారా చూస్తానన్నారు. అందరికి అన్ని రోజులు ఉండవన్నారు.
వారు బచ్చాలు
తనను సిఎల్పీలోకి రాకుండా అడ్డుకున్న వారిని డిఎల్ రవీంద్రా రెడ్డి బచ్చాలతో పోల్చారు. టిడిపి నుండి హడావుడిగా వచ్చిన వారికి అవకాశమిచ్చారని, తనకు ఏదో ఒకరోజు అవకాశమొస్తుందన్నారు.












Click it and Unblock the Notifications