ఈసికి జగన్ వర్గం లేఖ: ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన బాబు
ఎన్నికల గడువు మరో ఏడాది ఉన్నందున తమ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధుల అవసరం ఉందని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏవి, ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలు జరపాలని చంద్రబాబు, కిరణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఎన్నికల సంఘానికి లేఖలు రాయాలని సవాల్ విసిరారు. స్వార్థ రాజకీయానికి స్పీకర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారన్నారు.
ఎమ్మెల్యేలపై బాబు ఫైర్
అసెంబ్లీ నడుస్తున్న తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని పదే పదే వాయిదా వేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీరు మునిగేందుకు సిద్ధంగా ఉన్నా.. తాను మాత్రం లేనని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా స్పందించడం లేదన్నారు. అసెంబ్లీలో మూడు గంటలు కూడా ఉండలేని వారు ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.