నన్నంటారా: బాబుపై కన్నా, బంగారు తల్లిపై బొత్స క్లాస్
బంగారు తల్లి చట్టబద్దతపై అంత తొందరెందుకన్నారు. తొందరపడి పథకం తీసుకు వస్తే, చట్టబద్ధత తెస్తే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందెవరన్నారు. పథకంలో లోపాలున్నాయని చెప్పారు. ఇరవై ఏళ్ల పాటు ఆడపిల్లలకు పథకమంటే సాధ్యమయ్యే పనా, ఆసుపత్రుల్లో పుడితేనే పథకం వర్తిస్తుందా, చట్టబద్ధతకు తొందరెందుకు.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సమయంలో బంగారు తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స తనకు గాంధీ భవనంలో పని ఉందని చెప్పి వెళ్లిపోయారు. మంత్రలు జానా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు కూడా పలు అనమానాలు వ్యక్తం చేశారు.
బంగారు తల్లి పథకంలో కీలక నిబంధనలు
బంగారు తల్లి పథకంలో కీలక నిబంధనలు చేర్చనున్నారని సమాచారం. 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనే ఈ పథకం వర్తిస్తుంది. తెల్ల కార్డు ఉండి ఆసుపత్రిలో ప్రసవమైతే ఈ పథకం వర్తిస్తుంది.
ప్రతిపక్షాలపై శ్రీధర్ బాబు మండిపాటు
ప్రతిపక్షాలు పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించడం లేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సభ నిర్వహణకు ప్రతిపక్షాల సహకారం తప్పనిసరి అన్నారు. సభాపతికి తెలుగుదేశం పార్టీ లేఖ ఆ వ్యవస్థను కించపర్చేలా ఉందన్నారు.
స్టే తెచ్చుకొని నన్నంటారా?: బాబుపై కన్నా
తనపై కేసు వేస్తే కోర్టు నుండి స్టే తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనను కళంకిత మంత్రి అనడం విడ్డూరంగా ఉందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఆయన రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అమెరికాకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆసక్తి లేకపోవడం వల్లనే బాబు అమెరికా వెళ్తున్నారని విమర్శించారు.
గాలి పోగు చేసి గోల చేసే పార్టీ: సి.రామచంద్రయ్య
తెలుగుదేశం పార్టీ గాలి పోగు చేసి గోల చేసే పార్టీ అని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు. సభాపతికి లేఖ రాయడం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిదర్శనమన్నారు.
చలో అసెంబ్లీ అంటే అమెరికా అంటున్నారు: ఈటెల
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ కూడా మాట్లాడుతూ.. రాష్ట్రమంతా చలో అసెంబ్లీ అంటుంటే, చంద్రబాబు చలో అమెరికా అంటున్నారని ఎద్దేవా చేశారు.