బాబు, జగన్: సభలో మంచి ఛాన్స్ వదిలేసిన టిఆర్ఎస్
హైదరాబాద్: అసెంబ్లీలో తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలని తెలంగాణ విషయంలో దోషులుగా నిలబెట్టే మంచి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి వదులుకుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం రోజు భారతీయ జనతా పార్టీ, తెరాస, సిపిఐ, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు పదే పదే తెలంగాణ కోసం పట్టుబట్టడంతో సభాపతి నాదెండ్ల మనోహర్ పలుమార్లు సభను వాయిదా వేశారు.
సభ పదే పదే వాయిదా పడుతుండటంతో సభాపతి పార్టీల ఫ్లోర్ లీడర్లను తన ఛాంబర్కు పిలిచారు. సభ సజావుగా సాగేందుకు ఆయన వారితో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ గైర్హాజరైంది. రెండేళ్లుగా స్పీకర్ వైఖరిని నిరసిస్తూ టిడిపి స్పీకర్ సమావేశానికి రాలేదు. తెరాస సహా మిగిలిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు వచ్చారు. ఈ సమయంలో చలో అసెంబ్లీ నేపథ్యంలోని అరెస్టులు తదితర అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది.
ఈ నిర్ణయంతో అన్ని పార్టీలు సంతృప్తి వ్యక్తం చేశాయి. టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి వస్తానని చెప్పారు. పదిహేను నిమిషాల తర్వాత మరో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి వచ్చారు. తెలంగాణ అరెస్టులపై చర్చించేందుకు తాము కూడా సిద్ధమేనని అయితే, అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితేనే అందుకు తాము సమ్మతిస్తామని చెప్పారు.
అక్కడే ఉన్న మంత్రి శ్రీధర్ బాబు అందుకు అంగీకరించలేదు. చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్ర అరెస్టులపై చర్చించేందుకు మాత్రమే సిద్ధమని, తీర్మానం కుదరదని తేల్చి చెప్పారు. దీనిపై సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైఖరిని అసెంబ్లీ సాక్షిగా తెలియజెప్పే మంచి అవకాశాన్ని తెరాస వదులుకుందని అన్నారు. తెరాస తీర్మానం కోసం పట్టుబట్టింది. తెలంగాణ అరెస్టులపై చర్చ జరిగితే టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు వైఖరి మరోసారి బయటపడేదని ఆయన అభిప్రాయపడ్డారు.