తెలంగాణ: భారీ ప్యాకేజ్కు రంగం సిద్ధం?, రాహుల్ దృష్టి
తెలంగాణపై తేల్చకుంటే మరికొందరు ఆ బాట పట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి తేల్చాలనే ఉద్దేశ్యంతో అధిష్టానం ఇప్పుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వడం సాధ్యం కాదని భావిస్తున్న అధిష్టానం, భారీ ప్యాకేజీ విషయమై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్యాకేజీని సిద్ధం చేస్తోందట. ఇందులో పలు అంశాలను జొప్పించారని సమాచారం.
కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ తెలంగాణ సాధ్యం కాదని, ప్యాకేజీ ద్వారానే సమస్యను కొంతలో కొంత పరిష్కరించాలని భావిస్తోందట. ప్యాకేజీలో ప్రధానంగా ఉద్యోగ అంశాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. నేతలకు రాజకీయ పదవులలో కోటా, ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా, వెనుకబడిన తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక నిధి, కొన్నింటికి చట్టం, కొన్నింటికి హామీ ఇచ్చి తేల్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా దీనిపై దృష్టి సారించారని తెలుస్తోంది.
ఢిల్లీకి వెళ్లాలనే యోచనలో మంత్రులు, ఆందోళన
ప్యాకేజీ వార్తల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి తేల్చుకోవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వెళ్లకుంటే ప్యాకేజీకే పరిమితం కావాల్సి ఉంటుందని, అప్పుడు తెలంగాణలో నష్టం తప్పదని భావిస్తున్నారట. దీంతో 30న తలపెట్టిన సభపై నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ప్యాకేజీ ప్రచారం నేపథ్యంలో సభ కాకుండా ఢిల్లీకే వెళ్లాలని పలువురు భావిస్తున్నారు.
అదిష్టానానికి కట్టుబడి ఉంటాం: సీమాంధ్ర నేతలు
తెలంగాణ విషయంలో తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రులు రఘవీరా రెడ్డి, మాణిక్య వర ప్రసాద్లు చెబుతున్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని అయితే, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.