తెలంగాణ: వేడెక్కిన ఢిల్లీ, కోర్ కమిటీ కసరత్తు
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బలమైన సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెసుకు చెందిన సమైక్యవాదులతో పాటు తెలంగాణ నాయకులు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను కలిశారు. రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుందని సంకేతాలు అందుతున్నాయి. కానీ అందుకు సంబంధించి కచ్చితమైన విషయాలు తెలియడం లేదు. ఎలా విభజిస్తుందనే విషయంపై ఏ మాత్రం స్పష్టత లేదు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం చాలా గుట్టుగా వ్యవహరిస్తోంది. తమ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల సీనియర్ నాయకులకు చెప్పాల్సిన విషయాలు చెప్పేసి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, ఎఐసిసి ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఢిల్లీలో లేకపోవడంతో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ సమావేశానికి రాలేదు.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు దిగ్విజయ్ సింగ్ కోర్ కమిటీ సమావేశంలో వివరించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు శుక్రవారం ఉదయం దిగ్విజయ్ సింగ్ సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య తెలంగాణపైనే చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. తెలంగాణ అంశంపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెప్పామని, రోడ్ మ్యాప్లు పరిశీలించిన తర్వాత అధిష్టానానికి నివేదిస్తానని షిండేతో భేటీ తర్వాత దిగ్విజయ్ సింగ్ మీడియాతో చెప్పారు. షిండేతో చర్చించిన విషయాలు బయటకు చెప్పేవి కావని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడమనేవి రెండు వేర్వేరు అంశాలని ఆయన అన్నారు.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. తెలంగాణపై అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకే ఆయన ఢిల్లీ వచ్చినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ తెలంగాణకు అనుకూలంగా నివేదిక సమర్పించే అవకాశాలున్నట్లు తెలంగాణ నాయకులు నమ్ముతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా నియమితులు కావడానికి ముందు బొత్స తెలంగాణకు అనుకూలంగా గట్టిగా మాట్లాడడమే ఆ నమ్మకానికి కారణం.
ఇదిలావుంటే, ఒకటి, రెండు వారాల్లో తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన దిగ్విజయ్ సంగ్తో సమావేశమయ్యారు. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా తెలంగాణ నిర్ణయం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇస్తే 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని, మరోసారి యుపిఎ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications