తెలంగాణ: డిగ్గీ నోట రాజ్యాంగ సవరణ మాట, ఎందుకు!?

తెలంగాణపై నిర్ణయానికి రాజ్యాంగ సవరణ అవసరమని, అందువల్ల విపక్షాలతోనూ చర్చలు జరపాల్సి రావొచ్చునని ఆయన చెప్పారు. రాజ్యాంగ సవరణ అవసరమయ్యే నిర్ణయం ఏమిటి? ఇదీ ఇప్పుడు ఆందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ను విభజించాలన్నా, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి ఏదో ఒక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తులు, హోదాలు ఇవ్వాలన్నా రాజ్యాంగాన్ని సవరించాల్సిందేనని చెబుతున్నారు.
రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించాలి. ఒక రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల్లో మార్పు చేర్పులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దిశా నిర్దేశం చేస్తుంది. ఆ ప్రక్రియ ప్రకారం పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన తర్వాత అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరిన్ని మార్పులు అవసరమవుతాయని పరిశీలకులు చెబుతున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371- డి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసమే రూపొందింది. దీని ద్వారా రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు, హక్కులు సంక్రమించాయి. జోనల్ వ్యవస్థ, లోకల్ క్యాడర్ ఏర్పాటు వంటివి కూడా దీని ఆధారంగానే ఏర్పడ్డాయి. రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగంలోని 371-డిని రద్దు చేయడం లేదా సవరణలు చేయడం జరగాలంటున్నారు.
రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు, వాటి భౌగోళిక స్వరూపాలకు సంబంధించిన నిర్వచనం ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడినా, విభజన జరిగినా ఆ మేరకు మొదటి షెడ్యూల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి, తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హోదాలాంటివి కల్పించాలన్నా ఆ మేరకు సంబంధిత అధికారణలను సవరించాల్సి ఉంటుందంటున్నారు.
రాజ్యాంగంలో ఏ చిన్న సవరణ చేయాలన్నా పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు కూడా సహకరిస్తే తప్ప రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందదు. అందుకే దిగ్విజయ్ విపక్షాలతోనూ చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని బిజెపి చెబుతుండడం గమనార్హం.
రాజ్యాంగ సవరణ అవసరం లేదు: విద్యాసాగర రావు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ, అసెంబ్లీ తీర్మానం అవసరమే లేదని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ తెలంగాణపై చేసిన ప్రకటన చాలా వివాదాస్పదంగా ఉందని, తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచేలా ఉందని ఆయన కరీంనగర్లో పేర్కొన్నారు. దీనిని బిజెపి పక్షాన తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ కోసం రెండవ ఎస్సార్సీ, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని ప్రకటన చేయడం దారుణమన్నారు.












Click it and Unblock the Notifications