భిక్ష పెడితే విమర్శలా?, మద్యం డాన్: బొత్సపై షర్మిల
చీపురుపల్లిలో ఉన్న వ్యాపారాలన్నీ బొత్స కుటుంబానివే అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యాన్ని పూర్తిగా నియంత్రించి నియోజకవర్గానికి ఒక మద్యం దుకాణం ఉండేలా చూస్తారని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తోందన్నారు.
మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. ప్రతి మద్యం దుకాణాన్ని మినీ బార్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుట్రతో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాయన్నారు. కిరణ్, చంద్రబాబు చీకటి ఒప్పందం ఫలితమే తన జగన్పై కేసులను ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల కష్టం పట్టడం లేదని, సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. బొత్స విశ్వాస ఘాతకుడని విమర్శించారు. తన తండ్రి పెట్టిన రాజకీయ భిక్షను మరచి ఆయన తమ కుటుంబాన్నే విమర్శించడం అనైతికమన్నారు. స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఆదరించి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.