భారీ వర్షాలు: దేవుడ్ని ప్రార్థించమన్న ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ/హైదరాబాద్: వర్షాలు ఆగేందుకు దేవుడిని ప్రార్థించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సూచించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోను జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం అతలాకుతలం అవుతోంది. జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వర్షాలకు అస్తవ్యస్థమవుతున్న విషయమై స్పందించారు. దేవుడిని ప్రార్థించామని, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ సమస్యలను పరిష్కరిస్తుందని ఆమె చెప్పారు.
తగ్గుముఖం పట్టిన గోదారి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గత ఐదు రోజులుగా పరవళ్లు తొక్కుతున్న గోదావరి వరద ఉధృతి సోమవారం కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు గోదావరి నీటిమట్టం 50.3 అడుగులకు చేరింది. ఇది మరింత తగ్గవచ్చునని అధికారులు చెబుతున్నారు.
ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు 48 అడుగులకు తగ్గే అవకాశముందని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో పాటు ఇతర ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలను అధికారులు పునరుద్ధరిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోలో పలు లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక పడవలు ఏర్పాటు చేశారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
రాజమండ్రి వద్ద గోదావరి ఉధృతి తగ్గింది. దవళేశ్వరం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 16.9 అడుగులుగా ఉంది. దాదాపు పద్దెనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తన్నారు. జూరాల ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేశారు.
రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఇవాళ్టి వరకు సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. విశాఖ, అనంతపురం జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు కురవాల్సిన సాధారణ సగటు వర్షపాతం కంటే 29 శాతం అధికంగా నమోదైందని తెలిపింది.