కేదార్నాథ్ గుడి రీబిల్డింగ్: మోడీని కాదన్న చౌహాన్
భోపాల్: కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విభేదించారు. మెరుపు వరదలకు ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణం గురించి ఆలోచించే సమయం ఇది కాదని చౌహాన్ అన్నారు. దానిపై చర్చించే సమయం కాదని ఆయన అన్నారు.
కేదార్నాథ్ ఆలయం పునర్నిర్మాణంపై తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ పనిని చూసుకుంటుందని ఆయన అన్నారు. హరిద్వార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సాధువులు, ఆచార్యుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మిస్తుందని ఆయన చెప్పారు.

ఉత్తరాఖండ్లో జరిగిన ప్రకృతి వైపరీత్యం భారీగా ఉందని, దాని ప్రభావాన్ని తగ్గించడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆలయాన్ని పునర్నిర్మించడానికి మోడీ ముందుకు వచ్చారు. అయితే, అందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ ఆ పని చేపడతాయని ఆయన చెప్పారు.
నరేంద్ర మోడీతో బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా విభేదించారు. కేదార్నాథ్ ఆలయం హిందువుల విశ్వాసానికి సంబంధించిందని, హిందూ సమాజం, హిందూ మత విశ్వాసకులు ఆలయాన్ని పునర్నిర్మించే విషయాన్ని చూసుకుంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications