పంచాయతీ ఎన్నిక: స్వల్ప ఘర్షణలు, మారిన గుర్తులు

పలు పోలింగ్ బూతుల వద్ద చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ప్రకాశం జిల్లాలోని అడుసుమిల్లి పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి కాంగ్రెసు, కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి వద్ద కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, ప్రకాశం జిల్లా లింగుంగుట్లలో ఏజెంట్ల మధ్య, శ్రీకాకుళం జిల్లాలోని కేశవదాసుపురంలో టిడిపి, కాంగ్రెసుల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గుంటూరు జిల్లా కట్టవాడ గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. నెల్లూరు పెద్దపట్నంపాలెంలో అభ్యర్థుల గుర్తు మారడంతో పోలింగ్ నిలిచిపోయింది.
బొత్స, దామోదర తర్వాత కిరణ్!
కాగా కాంగ్రెస్ అగ్రనేతల సొంత జిల్లాల్లో పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కిరణ్ కుమార్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు! ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా మెదక్లో, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలలో కాంగ్రెస్ అత్యధిక ఏకగ్రీవ పంచాయతీలను దక్కించుకుని నంబర్ వన్గా నిలిచింది. కానీ, చిత్తూరులో కిరణ్కు ఎదురు గాలి వీచింది.
వేలంపై ఈసి వేటు
వేలం ద్వారా.. డబ్బు ఖర్చు పెట్టి అయినా పదవిని దక్కించేసుకున్నామని సంబరపడుతున్న 'సర్పంచుల'కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. వేలం నిర్వహించినట్లు గుర్తించిన 18 'ఏకగ్రీవ పంచాయతీ' ఫలితాలపై వేటు వేసింది. వాటికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రకటించారు. పంచాయతీల్లో వేలంపై ఫిర్యాదులు వచ్చాయని, వాటి పై కలెక్టర్లతో విచారణ జరిపించామని, ఆరోపణలు నిజం కావడంతో అక్కడ మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. కాగా వర్షాల కారణంగా పలు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ వాయిదా వేశారు. కాగా ఈ నెల 27న సెకండ్ ఫేజ్, 31న మూడో ఫేజ్ ఎన్నికలు జరుగుతాయి. అన్ని ఫేజులలోను ఓటింగ్ రెండు గంటల వరకు జరుగుతుంది. అనంతరం రెండు గంటలకు లెక్కింపు జరుగుతుంది.












Click it and Unblock the Notifications