నేడు, రేపు ఈ జిల్లాలకు భారీవర్ష సందేశం ఇచ్చిన ఐఎండీ!
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే 48 గంటల వ్యవధిలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు రాష్ట్రంలోని అనేక జిల్లాలను ప్రభావితం చేయనున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తు నిర్వహణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేశారు. ఈ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దక్షిణ, తూర్పు తెలంగాణాలలో వర్షాల తీవ్రత
దక్షిణ మరియు తూర్పు తెలంగాణలోనూ వర్షాల తీవ్రత తగ్గే అవకాశం లేదు. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షాలు పడే స్థితి ఏర్పడింది. అటవీ వాగులు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున అక్కడి యంత్రాంగం ముందస్తుచర్యలు చేపట్టింది.
అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని పూర్తి అప్రమత్తంగా ఉంది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసి సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు అత్యవసరం కాకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం చేసేవారు వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
రైతులు పొలాలలో జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖాధికారులు
రైతులు మరియు వ్యవసాయ కూలీల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు. వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులు ఉంటే ఎత్తైన చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, తక్షణం సురక్షితమైన ఇళ్లలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పిడుగుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. పశువులను మేపడానికి వెళ్లే కాపరులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చారు.













Click it and Unblock the Notifications