EHS: జులై 15 నుంచి మీకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది!
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 'ఉద్యోగుల ఆరోగ్య పథకం' (EHS) అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ పథకాన్ని జులై 15వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఉద్యోగుల హెల్త్కేర్ ట్రస్ట్ (EHCT) తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కొత్త మార్గదర్శకాలపై కసరత్తు
పథకం అమలుకు సంబంధించి సమగ్రమైన మార్గదర్శకాలను వచ్చే వారంలోగా జారీ చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. గతంలో ఉన్న లోపాలను సవరించి, వైద్య సేవలను మరింత వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా, భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, ఈహెచ్ఎస్ కోసం ఒక్కరి నుంచి మాత్రమే చందా వసూలు చేయాలని ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఇద్దరి నుంచి అదనంగా కట్ అయిన సొమ్మును కూడా తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
అదనపు సౌకర్యాల కోసం ఉద్యోగ సంఘాల విన్నపం
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ప్రస్తుతం చికిత్సకు ఉన్న గరిష్ఠ పరిమితి రూ. 2 లక్షలను రూ. 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలను పథకంలో చేర్చాలని, అలాగే ఆయుర్వేద చికిత్సలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గతంలో 1885 వ్యాధులకు వర్తించిన ఈ పథకాన్ని మరిన్ని వ్యాధులకు విస్తరించాలని, ఎక్కువ సంఖ్యలో కార్పొరేట్ ఆసుపత్రులను ఎంపిక చేయాలని కోరారు. చికిత్సానంతరం బిల్లుల చెల్లింపు ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని, 15 రోజుల్లోగా చెల్లింపులు జరగాలని వారు సూచించారు.
త్వరలో ప్యాకేజీ రేట్లపై స్పష్టత
వచ్చే వారం రోజుల్లో ఆసుపత్రుల యాజమాన్యాలు, ఆరోగ్యశాఖ అధికారులు మరియు ట్రస్ట్ సభ్యులతో మరో దఫా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆసుపత్రుల జాబితాను ఖరారు చేయడంతో పాటు, ప్యాకేజీ రేట్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పదవీ విరమణ పొందుతున్న సీఎస్ను ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు.














Click it and Unblock the Notifications