విపక్షాలదే బాధ్యత: టిజి వెంకటేష్, టిడిపియే: శైలజానాథ్

సమైక్యాంధ్ర ఉద్యమానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టదలిచిన కార్యాచరణపై బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సీమాంధ్ర ప్రాంత మంత్రులంతా సమావేశమవుతున్నట్లు టిజి వెంకటేష్ చెప్పారు. తాము త్వరలో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని చెప్పారు.
కేంద్రంలోని మంత్రులందరినీ కలిసి సమన్వయపర్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ ఇచ్చినా, ఇబ్బంది లేదంటూ రాజకీయ పార్టీలు అన్ని వ్యాఖ్యానించడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆయన అన్నారు. విభజనకు విపక్షాలే బాధ్యత వహించాలన్నారు.
కీలక దశలో: శైలజానాథ్
రాష్ట్ర విభజన కసరత్తు కీలక దశలో ఉందనిపిస్తోందని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఎజెండాతో సీమాంధ్ర మంత్రులందరూ రేపు మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అవుతారన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కలుస్తామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు, ఇతర సంఘాలు సమైక్య ఉద్యమానికి సిద్ధపడటం సంతోషకరమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం లేదంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన టిడిపి దీనికి ప్రధాన బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications