తెలంగాణ ఇష్యూ: మళ్లీ తెర మీదికి కిరణ్ రాజీనామా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వ్యవహారం మళ్లీ తెర మీదికి వచ్చింది. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆయన రాజీనామా చేయవచ్చునంటూ ఆదివారం దినపత్రికల్లో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో చెప్పినట్లు ఇటీవలి కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం నేపథ్యంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆయన ఖండించారు.
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఇప్పుడు మరోసారి వార్తలు వచ్చాయి. విభజన అంశంపై ఆయన తీవ్ర అంతర్మథనానికి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. తాను చెప్పిన మాటలను అధిష్టానం వినడం లేదని, తన మాటలను నమ్మడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి స్థితిలో పదవిలో కొనసాగడం అవసరమా అని ఆయన ఆలోచిస్తున్నట్లు ఆ ప్రముఖ తెలుగు దినపత్రిక వార్తాకథనం సారాంశం.
తన సన్నిహిత మిత్రుల వద్ద ఆయన అధిష్టానం తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఆయన పత్రికర రాసింది. విభజనకు సంబంధించి పార్టీ పెద్దలు తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం కిరణ్ కుమార్ రెడ్డిని ఆవేదనకు గురి చేస్తోందని అంటున్నారు. తమ తండ్రి హయాం నుంచి, అంటే 1962 నుంచి తాము కాంగ్రెసుతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని, పార్టీకి నష్టం చేసే నిర్ణయాన్ని అమలు చేయడంలో భాగస్వామిని కాలేనని ఆయన పార్టీ ఢిల్లీ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్లకు చెప్పినట్లు తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి రాసింది.
విభజనపై కేంద్రం నిర్ణయం కన్నా తన మాటలను అధిష్టానం నమ్మకం పోవడమే కిరణ్ కుమార్ రెడ్డి మనసును గాయపరిచినట్లు ఆ పత్రికా రాసింది. సహకార ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టానని, పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తోందని, కొద్ది కాలంలోనే తాను పార్టీ నిలబెట్టానని, అయినా తనపై అధిష్టానం నమ్మకం ఉంచడం లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, రాజీనామా చేస్తే విభజన జరిగినప్పుడు సీమాంధ్రకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కిరణ్ కుమార్ రెడ్డికి కొందరు నచ్చజెబుతున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత హైదరాబాద్ విషయంలోనేూ, సీమాంధ్రకు రక్షణ చర్యలు, ఇతరత్రా ప్రయోజనాలు సాధించడానికైనా పదవిలో కొనసాగాల్సిందేనని అంటున్నట్లు తెలుస్తోంది.