తెలంగాణలో పేరుకే: డిఎస్తో కొండా సురేఖ చర్చలు?
ఇప్పటికే పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పార్టీకి సలాం కొట్టారు. కొండా దంపతులు సహా మిగిలినవారూ ఇదే బాటలో పయనిస్తున్నారని సమాచారం. కొండా సురేఖ దంపతులు ఇప్పటికే పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వారు కాంగ్రెసు పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ విషయంలో పార్టీ నాయకత్వ వైఖరిపై కొండా సురేఖ తిరుగుబాటు ప్రకటించారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం వైఖరిని నిరసిస్తూ నేత విజయలక్ష్మి మినహా ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దానిపై తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. దాంతో తెలంగాణ నేతలతో పార్టీ ప్రముఖులు శుక్రవారం చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. వారిని బుజ్జగించేందుకు అధిష్ఠానం ముఖ్యులు మరోసారి శనివారం భేటీ అయ్యారు. అయినా ఫలితం కనిపించలేదు.
ఈ సమావేశంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు వైవీ సుబ్బారెడ్డి, మైసూరా రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కొండా సురేఖ, మురళి, జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్రెడ్డి, రవీంద్రనాయక్, కొమ్మూరి ప్రతాప్రెడ్డి, రాజ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి ముందు శనివారం ఉదయమే అధిష్ఠానం ముఖ్యులు తెలంగాణ నేతలకు ఫోన్ చేశారని అంటున్నారు. తెలంగాణపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో చెప్పిన అభిప్రాయానికి కట్టుబడి ఉంటామని, అదే విషయాన్ని ఇప్పుడు విజయలక్ష్మి పేరుతో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తామని అధిష్టానం ప్రముఖులు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.
అయితే, తాము లేకుండా, ఆ ప్రకటన సారాంశం తెలియకుండా ఎలా బయటికి చెబుతారని తెలంగాణ నేతలు ప్రశ్నించారు. ముందు చెప్పినట్టు సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ప్రకటన చేయాలని కోరారని అంటున్నారు. ఈ మేరకు విజయలక్ష్మి నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడు గంటల వరకు సాగింది.
అయితే, తెలంగాణ నేతలకు అధిష్టానం ప్రముఖులు సర్దిచెప్పడానికి ప్రయత్నించారే తప్ప తమ వైఖరిని మార్చుకోవడానికి సిద్ధపడలేదని అంటున్నారు. దీంతో సమావేశం జరుగుతుండగానే పార్టీ తెలంగాణ నేతలు మూడునాలుగుసార్లు లేచి బయటకు వచ్చేసేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. వారిని అధిష్ఠానం ముఖ్యులు అనునయించారు. ఆదివారం నాటి సమావేశానికి రాబోమని, ఇదే ఆఖరి సమావేశం కావచ్చని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. సమావేశంలో కొండా సురేఖ వైయస్ విజయమ్మ తీరుపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అధిష్టానమే సమైక్యవాదంతో సీమాంధ్ర శాసనసభ్యులతో రాజీనామా చేయిస్తోందనే అభిప్రాయాన్ని తెలంగాణ నేతలు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి వంటి కొద్ది మంది ఇద్దరు ముగ్గురు తెలంగాణ నాయకులు పార్టీ అధిష్టానానికి అండగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం ఉండదని అంటున్నారు.