విభజన: 90 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారు?
శాసనసభలో తీర్మానం, కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు, కేంద్ర కేబినెట్ తొలి నోట్, దానికి మంత్రివర్గం ఆమోదం, రాష్ట్రపతి సిఫారసుతో అసెంబ్లీకి బిల్లు, అసెంబ్లీలో బిల్లు పరిశీలన, కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు బిల్లు ముసాయిదా, కేబినెట్ తుది నోట్, బిల్లుకు సాధారణ మెజారిటీతో పార్లమెంటు ఆమోదం, చివరగా రాష్ట్రపతి ఆమోద ముద్ర అనే 12 దశల్లో కొత్త రాష్ట్రం ఏర్పడాల్సి ఉంటుంది. వీటిలో శాసనసభలో తీర్మానం అవసరం లేదనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయాన్ని కోరేంత వరకే పరిమితం కావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
విభజన ప్రక్రియ కుదింపుపై ఒక కేంద్ర మంత్రికి హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి వివరించినట్లు ఆదివారం మీడియాలో వార్తలు వచ్చాయి. సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోగానే కేబినెట్కు నివేదించేలా ఒక నోట్, బిల్లు ముసాయిదా ప్రతిపై హోంశాఖ, న్యాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. త్వరలో యుపిఎ సమన్వయ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. రెండు వారాల్లో రాష్ట్రపతికి బిల్లు పంపి, అసెంబ్లీ అభిప్రాయం కోరాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
వాస్తవానికి, అసెంబ్లీ అభిప్రాయం కోసం నెల గడువివ్వడం సంప్రదాయమని అంటున్నారు. కానీ, ప్రస్తుత స్థితిలో దాన్ని వారం లేదా రెండు వారాలకే కుదించనున్నారు. తెలంగాణ బిల్లును కేబినెట్ ఆమోదించగానే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడితోపాటు హోం, ఆర్థిక, విద్య, ఆరోగ్య, నీటిపారుదల, విద్యుత్, పర్యావరణ, అటవీ, రైల్వే, మానవ వనరులు, ఎరువులు, ఆహార, వినియోగ వ్యవహారాలు, కార్మిక తదితర మంత్రిత్వ శాఖలతో అధికారుల బృందం ఏర్పాటవుతుందని సమాచారం.
ఈ బృందం నివేదిక మేరకు విభజన ప్రక్రియ మొదలవుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి 2 రోజులముందు నోటీసు ఇస్తే సరిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి. బిల్లు ఆమోదానికి 15 రోజులు పడుతుంది. అవసరమైతే రెండుమూడు రోజుల్లో పూర్తి చేసే వీలుందని చెబుతున్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తుండడంతో బిల్లు ఆమోదం పొందడం కష్టమేమీ కాదని భావిస్తున్నారు.