తెలంగాణను ఒప్పుకోం, కిరణ్ శభాష్: ములాయం సింగ్
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై గళమెత్తిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేశానికి ప్రమాదకరమని, అయిష్టంగా ఏ రాష్ట్రాన్నైనా ఏర్పాటు చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. విభజన పేరుతో ప్రజల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారన్నారు. విభజన ఎన్ని రాష్ట్రాలకు విస్తరిస్తే దేశానికి అంత ముప్పు అని హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ను విభజించి ఉత్తరాఖండ్ను, మధ్యప్రదేశ్ను విభజించి ఛత్తీస్గఢ్, బీహార్ను విభజించి జార్ఖండ్ను ఏర్పాటు చేశారని, ఇప్పుడా రాష్ట్రాల పరిస్థితి ఏంటని ములాయం ప్రశ్నించారు. తెలంగాణ పరిస్థితి కూడా ఇలాగే కాదన్న గ్యారెంటీ ఏమిటన్నారు. 22 కోట్ల జనాభా కలిగి సమస్యలు అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్లాంటి చోట సమంజసం కావచ్చుగానీ, తక్కువ జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల చిన్నరాష్ట్రాల ఏర్పాటు అవసరం లేదన్నారు.
చేతనైతే యుపిని విభజించి చూడాలని కేంద్రానికి సవాల్ విసిరారు. పార్లమెంటులో తెలంగాణపై ఓటింగ్ పెడితే మద్దతునిచ్చే ప్రసక్తే లేదన్నారు. అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కర్ణాటకలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా సుదీర్ఘమైన సమయం ఉన్నందున ఆ విషయమై చర్చ అవసరంలేదన్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఇఫ్తార్ విందులో ములాయం తన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు.