శాశ్వత రాజధాని, లేదంటే రాజీనామా: చిరంజీవి
దేశానికి హైదరాబాదును రెండో రాజధానిగా చేస్తూ, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానికి శాశ్వతంగా ఉంచవచ్చునని ఆయన అన్నారు. హైదరాబాదు విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలని తాను కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను సమైక్యవాదినని, అయితే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుంటే అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని, అది అనివార్యంగా మారిందని, దాంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నానని ఆయన వివరించారు.
అయితే, రాష్ట్ర విభజన విషయంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో గుర్తించి, అలా జరగకుండా చూస్తానని, అందుకే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. తమ అభ్యంతరాలను వినేందుకు ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీకి రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ సారధ్యం వహిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అత్యధిక పార్టీల అభిప్రాయం మేరకే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన అన్నారు.
కెసిఆర్కు తెలంగాణ కావాలా, వద్దా
ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తీవ్రంగా ప్రతిస్పందించారు. సీమాంధ్ర ఉద్యోగులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రెచ్చగొట్టడం కొనసాగిస్తే పరిణామాలు మరో విధంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కెసిఆర్ వ్యాఖ్యలు బాధాకరం, దురదృష్టకరమని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలకు అభద్రతా భావం కలిగేలా కెసిఆర్ మాట్లాడారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న సమయంలో సీమాంధ్ర ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు భరోసా కలిగించే విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాదని అనుకుంటున్నారా, అక్కరలేదని అనుకుంటున్నారా అని ఆయన కెసిఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. కెసిఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే కెసిఆర్ రాజకీయ నిరుద్యోగి అవుతారని ఆయన అన్నారు.
సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని అనడానికి కెసిఆర్ ఎవరని ఆయన అడిగారు. సీమాంధ్ర ప్రజలకు రక్షణ కావాలని, అందుకే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అడుగుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలని, హైదరాబాద్పై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉన్నత స్థాయి కమిటీ ఇస్తుందనే విశ్వాసం ఉందని ఆయన అన్నారు.