వ్యూహం: హైదరాబాద్పై అస్పష్టత బేరసారాలకే
హైదరాబాద్: వ్యూహాత్మకంగానే కాంగ్రెసు అధిష్టానం హైదరాబాద్పై పూర్తి స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు. రాష్ట్ర విభజనకు అంగీకరింపజేయడానికి ఇది పనికి వస్తుందని భావించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ విషయంలో బేరసారాలకు అవకాశం వదిలిపెట్టడం వల్ల చర్చ దానిపై కేంద్రీకృతమవుతుందని, ప్రాథమికంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకత ఎదురు కాదని భావించినట్లు సమాచారం.
హైదరాబాదు ఉభయ రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని సిడబ్ల్యుసి తీర్మానం తెలిపింది. అంతకు మించి వివరణ ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదును ఏం చేస్తారనే విషయంపై ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గత మూడు రోజులుగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేశారు.

హైదరాబాదు పాలనా యంత్రాంగంపై అస్పష్టమైన క్యాబినెట్ నోట్ ముసాయిదా తయారైంది. బేరసారాలు పూర్తయి, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఆ నోట్ మంత్రివర్గం ముందుకు వస్తుంది. హైదరాబాద్ విస్తీర్ణాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధికి విస్తరించాలని అనుకున్నారు. అయితే, తెలంగాణ నేతల ఒత్తిడితో దాన్ని హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధికే పరిమితం చేశారు.
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్ సీమాంధ్ర నేతల నుంచి వస్తోంది. హైదరాబాద్కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ సహా తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రాజధాని ఉండే పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారా, లేదంటే పరిపాలనకు దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications