కెసిఆర్కు బుల్లెట్ ప్రూఫ్ కారు, ఫాంహౌస్కు బలగాలు
ఈ నేపథ్యంలో కెసిఆర్కు ప్రభుత్వం భద్రత పెంచింది. కొత్త బుల్లెట్ కారును సమకూర్చింది. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగానే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబు స్క్వాడ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. స్థానిక ఎస్సై, ఎఆర్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుండి వచ్చిన ఎనిమిద మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఎవరినీ లోనికి అనుమతించలేదు.
విచారణ జరపాలి
తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పైన హత్యాయత్నం కుట్ర మీద సమగ్ర విచారణ జరిపించాలని తెరాస ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, డిజిపి స్పందించక పోవడం సరికాదన్నారు. కొందరు నాయకులు, ఎమ్మెల్యేలు తెరాస నుండి బయటకు వెళ్లిపోతున్నారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మరో పార్టీలోకి వెళ్లేందుకు ఎవరు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం బయటపడిందన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకుందని ప్రశ్నించారు.