అన్నీ తప్పులే, ఏందో చెప్తా: కిరణ్ రెడ్డిపై కెసిఆర్
నీటి పంపకాల వంటి పలు అంశాలపై సీఎం కిరణ్ చెబుతున్నవన్నీ పచ్చి అవాస్తవాలని తెరాస శాసనసభా పక్షథ ఉపనేత హరీశ్రావు ధ్వజమెత్తారు. "దోపిడీదారుడు బుసలు కొట్టాడు'' అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తానే నడుపుతున్నట్లు సీఎం పరోక్షంగా ఒప్పుకున్నారని, కిరణ్ రెడ్డి ముఖంలో, మాటల్లో, హావభావాల్లో తెలంగాణ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలను దోచుకునే అవకాశం పోతోందనే బాధ కిరణ్ మాటల్లో వ్యక్తమైందని, అబద్ధపు మాటలు, దొంగ లెక్కలతో ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించారని అన్నారు. దీనిపై సీఎం ముందుకొస్తే బహిరంగ చర్చకు సిద్ధమని, సమైక్యాంధ్ర కోసం రాసిన లేఖపై సంతకం చేశానని నిస్సిగ్గుగా చెప్పిన కిరణ్కు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగే హక్కులేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చట్టపరమైన చర్యలకు గవర్నర్ సిఫారసు చేయాలని, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం, టీ కాంగ్రెస్ నేతలు స్పందించాలిని ఆయన అన్నారు.
ఉద్యోగుల విషయంలోనూ ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ మొదలైందని కేంద్రం చెబుతుంటే, ఇప్పుడు సెకండ్ ఎస్సార్సీ అంటూ కిరణ్ కొత్త పాట అందుకుని లేని సమస్యలను తెరపైకి తెచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారని విమర్శించారు.
సీల్డ్ కవర్ సీఎంకు తెలంగాణ ప్రజల మనోభావాలు ఎలా అర్థమవుతాయంటూ తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు మండిపడ్డారు. కిరణ్ సీఎం పదవికి అనర్హుడని, సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే కొమ్ముకాసే సీఎం వైఖరిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర అవగాహన లేదని, ఆయన అవగాహనలేమితో బాధపడుతున్నారని మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ వ్యాఖ్యానించారు.