యూ టర్న్ తీసుకోలేదు, కచ్చితమే: విభజనపై కావూరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే పరిస్థితులు ఇంకా సంక్లిష్టమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొద్ది మంది రాజకీయ నాయకుల కోసం రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. 42 మంది లోకసభ సభ్యులున్న మన రాష్ట్రం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలు ఈ దేశానికి మేలు చేయవని కావూరి అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక అసలు ఇప్పుడు ప్రస్తావనకే రాలేదని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే తాము అధిష్టానానికి చెప్పామని, అలాంటి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే భవిష్యత్తులో తలెత్తే సమస్యలను, పరిణామాలను తాము అధిష్టానానికి వివరించినట్లు తెలిపారు.
తాను ఎప్పటికీ సమైక్యవాదినే అని, అయితే తుదిగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. విభజనపై వివిధ పార్టీలకు భిన్నాభిప్రాయాలున్నాయని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మాది కాదనే భావన అందరినీ కలచివేస్తోందని అన్నారు. నాలుగేళ్లు ఆగారు మరికొంత కాలం ఆగితే నష్టమేమీలేదని అన్నారు. విభజన వద్దని 9 మంది కేంద్ర మంత్రులం అధిష్టానానికి చెప్పామని, కాంగ్రెసు సిద్ధాంతాలపై తనకు నమ్మకం ఉందని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుంటుందని అన్నారు.
వ్యక్తిగత లాభాల ఆధారంగా తాను ఏనాడూ మాట్లాడలేదని, వేరొకరు వేలెత్తి చూపే పరిస్థితిని తాను ఏనాడూ తెచ్చుకోలేదని కావూరి అన్నారు. రాష్ట్రం ఇలాగే ఉంటే గౌరవం ఉంటుందని, అయితే ప్రజాస్వామ్యంలో మార్పులు సహజమని అన్నారు.