విభజనకు పార్టీలు పోటీ పడ్డాయి: లగడపాటి
రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చాలనే నిర్ణయాన్ని కాంగ్రెసు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు భయపడే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.
తెలుగు ప్రజలు కలిసి ఉండాలని అంటే తప్పు పడుతున్నారని, సమైక్య వల్ల కలిగే లాభాలను, విడిపోవడం వల్ల కలిగే నష్టాలను ముఖ్యమంత్రి వివరిస్తే తిట్టిపోస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మంచి మాట చెప్తే తప్పయిందా అని ఆయన అడిగారు. తాము మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తామని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే జల జగడాలు తలెత్తుతాయని, కృష్ణా డెల్టాకు చుక్కు నీరు కూడా రాదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమమని, ప్రజలకు లేని భయం పార్టీలకు ఎందుకని లగడపాటి అన్నారు.
హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు రగిలిపోతున్నారని, హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఎలా చెబుతారని, ప్రతి జిల్లాలో ప్రజలు రోడ్లెక్కుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చట్టసభల్లో ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో వేర్పాటువాద పార్టీ తెరాస విఫలమైందని, 2014 ఎన్నికల్లోనూ మట్టి కరిపిస్తామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు.
కెసిఆర్ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన అడిగారు. అమెరికాలో 50 వేల డాలర్లు కూడా రాని ఉద్యోగం చేస్తూ ఇక్కడి వచ్చి దోపిడీ చేస్తోందని ఆయన ఆరోపించారు. కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, టీ సెంటర్ పెట్టుకోవచ్చు అని ముఖ్యమంత్రిని అనడం సరైందా అని ఆయన అన్నారు. తెరాసకు కాలం చెల్లే రోజులు వచ్చాయని ఆయన అన్నారు. హైదరాబాదును అందరికీ హక్కు ఉన్న ప్రాంతంగా భావించామని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 80 నుంచి 90 శాతం మంది ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని సర్వేల్లో తేలిందని ఆయన అన్నారు. సమైక్యాన్ని కాపాడుకుటామని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో అన్ని పార్టీలు కూడా విఫలమయ్యాయని ఆయన అన్నారు.