టీపై కాంగ్రెసు వైఖరి: జగన్, విజయమ్మ రాజీనామా
హైదరాబాదులోని చంచల్గుడా జైలు నుంచి ఫాక్స్ ద్వారా లోకసభ స్పీకర్ మీరా కుమార్కు వైయస్ జగన్ తన రాజీనామా లేఖను పంపించారు. వైయస్ విజయమ్మ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెసు విధానాలకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లు మేకపాటి చెప్పారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులందరూ రాజీనామా చేశారని ఆయన చెప్పారు. అలాగే, లోకసభ సభ్యత్వాలకు తనతో పాటు వైయస్ జగన్ రాజీనామా చేశారని ఆయన అన్నారు.
విజయమ్మ కడప జిల్లాలోని పులివెందుల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, జగన్ కడప నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెసు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వారు రాజీనామాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు పదవులను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
విగ్రహాల విధ్వంసాన్ని తమ పార్టీ ప్రోత్సహించదని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చేతనైతే సామరస్యవూర్వకంగా సమస్యను పరిష్కరించాలని మైసురా రెడ్డి అన్నారు. నష్టం జరిగే విధంగా నిర్ణయం చేశారు కాబట్టి తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.