ఫొటోలు: నరేంద్ర మోడీతో భేటీకి ఇలా క్యూ...
హైదరాబాద్: బిజెపి రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ వద్ద సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు బారులు తీరారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు బాలకృష్ణ, మోహన్ బాబు, మురళీ మోహన్, రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ తదితరులు నరేంద్ర మోడీని కలిశారు.
ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, బిసి సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య కూడా మోడీని కలిశారు. నరేంద్ర మోడీ మొత్తం 81 మంది ప్రముఖులకు అపాయింట్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, హీరో బాలకృష్ణ మోడీని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మీప్రసన్నతో కలిసి మోడీని కలుసుకున్నారు.
నరేంద్ర మోడీ హైదరాబాదు పర్యటన ద్వారా పలువురు ప్రముఖులను తన వైపు తిప్పుకోవడంలో బిజెపి విజయం సాధించినట్లేనని అనుకుంటున్నారు. నరేంద్ర మోడీతో ప్రముఖుల భేటీకి మీడియాను అనుమతించలేదు. కానీ, వారు ఇలా బారులు తీరిన వైనాన్ని మాత్రం ఫొటోగ్రాఫర్లు పట్టుకున్నారు.
చిరంజీవి బావమరిది అల్లు అరవింద్
కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి బావమరిది, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పార్క్ హయత్ హోటల్లో గుజారత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆయన ఇలా పార్క్ హయత్ హోటల్కి దారి పట్టారు.
బాలయ్య కూతురు పెళ్లికి మోడీకి ఆహ్వానం
పార్క్ హయత్ హోటల్లో నరేంద్ర మోడీని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణకు నరేంద్ర మోడీపై అభిమానం ఉంది. తన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ బాలకృష్ణను ఆహ్వానించారు. కానీ రాజకీయ కారణాల వల్ల వెళ్లలేదు. తన రెండో కూతురు పెళ్లికి బాలకృష్ణ మోడీని ఆహ్వానించారు.
మోడీతో దిల్ రాజు
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కూడా బిజెపి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆయన పార్క్ హయత్ హోటల్లోకి వెళ్తూ ఇలా కనిపించారు. ఆయన బిజెపితో కలిసి పనిచేస్తారా అనేది చెప్పలేం.
మోడీతో మందకృష్ణ, కృష్ణయ్య
ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, బిసి సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య పార్క్ హయత్ హోటల్లో మోడీని కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కోసం సహకరించాలని మందకృష్ణ కోరగా, చట్టసభల్లో బిసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నించాలని కృష్ణయ్య విజ్ఝప్తి చేశారు.
మురళీ మోహన్ మోడీతో..
తెలుగుదేశం నాయకుడు, సినీ నటుడు మురళీ మోహన్ నరేంద్ర మోడీని కలిశారు. మురళీ మోహన్ వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ స్థానం నుంచి బిజెపి మరో నటుడు కృష్ణంరాజును పోటీకి దించే అవకాశాలున్నాయి.
టాక్ ఆఫ్ ద సిటీ..
పార్క్ హయత్ హోటల్ ఆదివారంనాడు టాక్ ఆఫ్ ద సిటీగా మారింది. నరేంద్ర మోడీ ఈ హోటల్లో పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. గుజరాత్ లాగా దేశాన్ని తీర్చిదిద్దాలనే తన ఆకాంక్షను మోడీ వారి వద్ద వెల్లడించారు.
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా..
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా నరేంద్ర మోడీని కలుసుకున్నారు. సినీ పరిశ్రమలో రాఘవేంద్ర రావుకు మంచి పేరు, పలుకుబడి ఉంది. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమానికి తన సహకారం అందించినట్లు చెబుతారు.
సుమన్ కూడా మోడీతో..
ప్రముఖ సినీ నటుడు సుమన్ నరేంద్ర మోడీని కలుసుకున్నారు. సుమన్కు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అవకాశం వస్తే ఆయన బిజెపి నుంచి పోటీ చేస్తారా అనేది భవిష్యత్తు తేలుస్తుంది.