జగన్కు దక్కా: దూరమైన సురేఖ, శ్రీహరి సైడ్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ అంశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కుదిపేస్తోంది. మాజీ మంత్రి కొండా సురేఖ నుండి మొదలు నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలోని తెలంగాణ నేతల రాజీనామాల పరంపర కొనసాగింది. తెలంగాణలో జగన్ పార్టీకి అంత పట్టు లేదు. ఇప్పుడు ఆయా జిల్లాల ముఖ్య నేతలు కూడా రాజీనామాలు చేయడంతో పార్టీ ఇబ్బందుల్లో పడింది.
వరంగల్ జిల్లాలో ముఖ్యనేతలుగా ఉన్న కొండా సురేఖ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కరీంనగర్ జిల్లాలో కెకె మహేందర్ రెడ్డి, అదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డిలు వరుసగా రాజీనామాలు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అంతగా పట్టులేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రముఖ నటుడు రియల్ స్టార్ శ్రీహరి ద్వారా పూడ్చుకుందమని భావించింది.
కానీ, ఇప్పుడు శ్రీహరి కూడా జగన్కు షాకిచ్చారు. శ్రీహరి తెలంగాణకు అనుకూలమో, సీమాంధ్రులకు వ్యతిరేకమో కాదు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జగన్ పార్టీ కంటే కాంగ్రెసు పార్టీయే బెట్టర్ అని భావించి ఆ పార్టీలో చేరనున్నారని సమాచారం. జగన్ పార్టీలో చేరేందుకు శ్రీహరి గతంలో జైల్లో ఉన్న ఆయనను కలిశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.
కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో కాంగ్రెసు పార్టీని వీడి ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తెలంగాణపై ఇడుపులపాయ తీర్మానాన్ని తుంగలో తొక్కారంటూ ఆమె జగన్ పార్టీకి రాజీనామా చేశారు. వైయస్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రురాలు సురేఖ. అలాంటిది ఆమె లక్ష కోట్ల దోపిడీ కోసమేనంటూ జగన్ పైన నిప్పులు చెరగడం గమనార్హం.
శ్రీహరి
ప్రముఖ నటుడు రియల్ స్టార్ శ్రీహరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున హైదరాబాదులోని ఏదో ఒక నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలను తొలుత భావించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెసు పార్టీయే బెట్టర్ అని భావిస్తున్నారట.
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
ఇడుపులపాయ తీర్మానాన్ని పక్కన పెట్టారని ఆరోపిస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. తెలంగాణ కోసం ఆయన రాజకీయ ప్రస్తానం తెలంగాణ రాష్ట్ర సమితితో ప్రారంభమైంది.
కెకె మహేందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లాకు చెందిన కెకె మహేందర్ రెడ్డి కరడుగట్టిన తెలంగాణవాది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా లేమని చెప్పడంతో ఆయన ఆ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుండి సిరిసిల్ల నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి షాకిచ్చారు. దీంతో దూరమయ్యారు.
ఇంద్రకరణ్ రెడ్డి
అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి కొద్ది నెలల క్రితమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తెలంగాణపై పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన నిన్న రాజీనామా చేశారు.
విజయా రెడ్డి
తెలంగాణపై పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు రాజీనామా చేశారు. హైదరాబాదుకు చెందిన ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా రాజీనామా చేశారు. అయితే వైయస్ రాజశేఖర రెడ్డితో పోరాడిన తెలంగాణవాది పిజెఆర్ తనయ విజయా రెడ్డి మాత్రం ఇంకా ఈ విషయమై పెదవి విప్పలేదు.