విభజన సెగ: సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ పిలుపు
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో గత 19 రోజులుగా ఉద్యమాలు సాగుతున్నాయి. ఎపి ఎన్జీవోలు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ స్థితిలో తాజా పరిణామాలపై చర్చించేందుకు కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి అహ్వానించినట్లు తెలుస్తోంది.
సోమవారం రాత్రి 8 గంటలకు తెలంగాణ నేతలు ఆంటోనీ కలుస్తున్నారు. అదే సమయంలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు రేపు మంగళవారం ఆంటోనీ కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏక వాక్య తీర్మానం చేసిన వారు ఆంటోనీ కమిటీకి దాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. సిడబ్ల్యుసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
సీమాంధ్రలో ఉద్యమాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. దానికితోడు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాదుపై పట్టుబట్టి కూర్చున్నట్లు తెలుస్తోంది. విభజన అనివార్యమైతే హైదరాబాదును కేంద్ర పాలితం ప్రాంతంగా చేయాలని కేంద్ర మంత్రి సాంబశివ రావు తాజాగా డిమాండ్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.